జూన్లో తగ్గిన వర్షపాతం.. ఈసారి వానలు అంతంత మాత్రమేనట..
ఢిల్లీ : మూడు రోజుల క్రితం కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఆ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి లక్షద్వీప్ మీదుగా ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంపై విస్తరించింది. ఇది క్రమంగా బలపడి రానున్న రెండురోజుల్లో వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత తుఫాన్గా మారనుంది. ఈ తుఫాను ప్రభావంతో కేరళతో పాటు లక్షద్వీప్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం
ఇదిలా ఉంటే ఎల్నినో ప్రభావంతో రుతుపనాలు వారం రోజుల పాటు ఆలస్యంగా ప్రవేశించాయి. దీంతో జూన్ నెల మొదటి తొమ్మిది రోజుల్లో సగటుకన్నా 45శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు ప్రకటించారు. సాధారణంగా జూన్ 9నాటికి దేశవ్యాప్తంగా 3.24సెం.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. ఈసారి అది 1.77సెం.మీలుగానే నమోదైంది. రుతుపవానాలు సకాలంలో రాకపోవడంతో దేశవ్యాప్తంగా 91 రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీటిమట్టం 30.461 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా గతేడాదితో పోలిస్తే ఇది 20శాతం తక్కువ కావడం గమనార్హం.
ఇప్పటి వరకు 45శాతం తక్కువ వర్షాలు
జూన్ 1 నుంచి 9 మధ్యకాలంలో తూర్పు, ఈశాన్య భారతంలో 81.4మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా... 41.8మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. వాయువ్య భారతంలో 32శాతం, మధ్య భారతంలో 66శాతం, దక్షిణ భారతంలో 25శాతం మేర తక్కువ వర్షపాతం కురిసింది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 45శాతం తక్కువ వానలు నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానాల్లో జూన్ చివరి వారం లేదా జులై మొదటివారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశముంది. అయితే ఈసారి వర్షాలు అంతంత మాత్రమే కురిసే అవకాశం ఉండటంతో అది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
రుతుపవనాల కారణంగా జూన్ నెలలో భారత్లో అతి తక్కువ సగటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ఎల్నినో పరిస్థితులు తొలగిపోయి మంచి వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా 89సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.