కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక మలుపు, తాజా నివేదికతో..!!
సంచలనంగా మారిన కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక మలుపు. టీటీడీ లడ్డూ లో కల్తీ జరిగిందనే ఆరోపణలు న్యాయ స్థానానికి చేరాయి. సుప్రీం ఆదేశాలతో విచారణ చేసిన సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాజకీయంగానూ ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ సమయంలోనే ప్రభుత్వం దీని పైన విచారణ కోసం ఏకసభ్య కమిషన్ నియమించింది. ఇప్పుడు విచారణ పూర్తి చేసిన కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. లడ్డూ వ్యవహారంలో ఈ నివేదిక.. ప్రభుత్వం తీసుకొనే చర్యలు కీలకంగా మారనున్నాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి వ్యవహారం పై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ విచారణ క్షేత్ర స్థాయిలో ముగిసింది. తిరుపతిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని విచారణ చేసిన కమిషన్ అక్కడి నుంచి అమరావతికి బయల్దేరింది. విచారణలో భాగంగా కమిషన్ ఛైర్మన్ రెండు రోజులు తిరుమలలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో నియమించిన ఈ కమిషన్ కల్తీ నెయ్యి వ్యవహారంలో గుర్తించిన లోపాల పై 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. కాగా.. కొన్ని ప్రత్యేక కారణాలతో ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడువు పెంపు కోరింది. దీంతో.. ఈ నెల 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి నివేదిక... సిఫారసులు
నెయ్యి కొనుగోలు సంబంధించి టెండర్ నిబంధనలు సడలింపు పైన పాలక మండలి ఈవోతో పాటుగా టీటీడీ ముఖ్య ఆర్దిక గణాంక సలహాదారు ఓ బాలాజీ నుంచి దస్త్రాలను దినేష్ కుమార్ సేకరించారు. మార్కెటింగ్, ప్రొక్యూర్ మెంట్ విభాగా అధికారులతో పాటు నెయ్యి కొనుగోలు నిర్దారణ, ఎక్స్ పర్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నవిజయ్ భాస్కర్ రెడ్డిని కీలక సమాచారం రాబట్టారు. కమిషన్ నివేదిక ను ప్రభుత్వం పరిశీలించి.. చేసిన సిఫారసులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా.. వీరి విచారణ సమయంలో కమిషన్ కీలక అంశాలను గుర్తించారని చెబుతున్నారు. దీంతో, ఈ నివేదికలో ఏ అంశాలను వెల్లడించారు.. ఎవరిని బాధ్యులను చేసారు.. ప్రభుత్వం ఎవరి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications