MI vs KKR: ముంబైని ముంచేసి ప్లేఆఫ్స్ రేసులోకి కేకేఆర్!
MI vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్కతా వేదికగా జరిగిన 65వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత విజయం సాధించింది. తమ సొంత గడ్డపై ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో గెలిచి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లకు 147 పరుగులు చేయగా, కేకేఆర్ 19వ ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కేకేఆర్కు 13 మ్యాచ్లలో 6 విజయాలతో 13 పాయింట్లు లభించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగిన తొలి ఆరు మ్యాచ్లలో ఒక్క విజయం లేకుండా (ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు సహా) నిరాశపరిచిన కోల్కతా.. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్లలో ఆరింటిలో గెలిచి అద్భుత పునరాగమనం చూపింది. మరోవైపు, ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్లకు 8 పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు పవర్ ప్లేలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ర్యాన్ రికెల్టన్ (6), నమన్ ధీర్ (0) త్వరగా ఔటయ్యారు. 41 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (15) , సూర్యకుమార్ యాదవ్ (15) వికెట్లు కోల్పోయింది. 8 ఓవర్లలో 4 వికెట్లకు 57 పరుగులు చేసిన స్థితిలో వర్షం అంతరాయం కలిగించగా, ఓవర్ల తగ్గింపు లేకుండానే ఆట తిరిగి మొదలైంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఐదో వికెట్కు 49 బంతుల్లో 43 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి స్కోరును 84కు చేర్చారు. తిలక్ వర్మ 20 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 26 పరుగులు చేశారు. చివరిలో కార్బిన్ బోష్ 18 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 32 పరుగులు చేసి ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి రెండేసి వికెట్లు తీయగా, సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ముంబై నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా నైట్ రైడర్స్ కూడా శుభారంభం చేయలేకపోయింది. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన మనీష్ పాండే, కెప్టెన్ అజింక్య రహానే (21) తో కలిసి 28 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే పవర్ ప్లే చివరి ఓవర్లో కార్బిన్ బోష్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కామెరూన్ గ్రీన్ (8 బంతుల్లో 4) కూడా నిరాశపరిచాడు.
8వ ఓవర్కు 54 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన కేకేఆర్ సంకట స్థితిలో పడింది. ఈ దశలో మనీష్ పాండేకు రోవ్మన్ పావెల్ తోడవగా, రెండుసార్లు లైఫ్ లభించిన పావెల్, పాండేతో కలిసి అర్ధసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి స్కోరును 100 దాటించారు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న మనీష్ పాండే 33 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.
రోవ్మన్ పావెల్ కూడా 30 బంతుల్లో 40 పరుగులు చేసి అల్లా ఘజన్ఫర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అంగ్క్రిష్ రఘువంశి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తేజస్వి దహియా 12 బంతుల్లో 11 పరుగులు చేశాడు. చివరకు రింకు సింగ్ 19వ ఓవర్లో ఫోర్ కొట్టి కేకేఆర్కు విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోష్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు.












Click it and Unblock the Notifications