చరిత్ర సృష్టించనున్న BSF మహిళా పర్వతారోహకులు.. ఎవరెస్ట్ ను అధిరోహించి..
సరిహద్దు భద్రతా దళం మహిళా పర్వతారోహకులు చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పర్వతారోహకుల బృందం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఒక చారిత్రాత్మక యాత్రను ప్రారంభించనుంది. ఇక సరిహద్దు భద్రతా దళం (BSF) 1965లో స్థాపించారు. ఈ ఏడాది డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకుంటోంది. దేశ భద్రతకు నిబద్ధతతో కూడిన ఈ బృందం వందేమాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా "మిషన్ వందేమాతరం" ను చేపట్టింది. BSF మహిళా పర్వతారోహణ బృందం ఈ మేరకు మే 21, 2026న మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర మహిళా సాధికారతకు, దేశ గౌరవానికి చారిత్రక ఘనత అవుతుంది.
BSF లక్ష్యాలు జాతీయ గౌరవం, నారీ శక్తి వందన్ (మహిళా సాధికారత), సాహస స్ఫూర్తిని ప్రోత్సహించడమే. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడానికి పూర్తిగా మహిళలతో కూడిన BSF బృందం చేపట్టిన తొలి ప్రయత్నం ఇది. జాతీయవాదాన్ని చాటిచెప్పేందుకు.. పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరం పైనుంచే వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు.
BSF ఎవరెస్ట్ బృందంలో లడఖ్ నుండి కౌసర్ ఫాతిమా, పశ్చిమ బెంగాల్ నుండి మున్మున్ ఘోష్, ఉత్తరాఖండ్ నుండి రబేకా సింగ్, లడఖ్/కార్గిల్ నుండి చెరింగ్ చోరోల్ ఉన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ నలుగురు పర్వతారోహకులు ధైర్యం, సంకల్పం, క్రమశిక్షణ, దేశ సేవ పట్ల అంకితభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ యాత్రలో వారి భాగస్వామ్యం BSF మహిళా సిబ్బంది సవాలుతో కూడిన సాహస ప్రయత్నాలలో పెరుగుతున్న పాత్రను, సామర్థ్యాలను స్పష్టం చేస్తుంది.

ఈ మహిళా బృందానికి హిమాలయాలలోని అత్యంత కఠినమైన వాతావరణం, మంచు తుఫానులు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేలా కఠినమైన శిక్షణను ఇచ్చారు. మే 21, 2026 తెల్లవారుజామున వాతావరణం అనుకూలిస్తే, శిఖరాన్ని అధిరోహించే తుది ప్రయత్నం జరగనుంది. "మిషన్ వందేమాతరం" ద్వారా BSF, జాతీయ సమైక్యత, మహిళా సాధికారత, దేశభక్తి, భారత్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పాలని కోరుకుంటోంది. యువతలో శ్రేష్ఠత, దృఢత్వం, మాతృభూమి సేవ పట్ల స్ఫూర్తిని నింపడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.












Click it and Unblock the Notifications