రాయలసీమ ఉద్యాన హబ్.. రాష్ట్రవాటా రూ.10 వేల కోట్లు భరించేలా ఏపీకి కేంద్రం భారీ సాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రాయలసీమ సమీకృత ఉద్యాన అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా రాయలసీమతో పాటు అవిభక్త ప్రకాశం జిల్లాను కూడా ఒకే పెద్ద ఉద్యాన హబ్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వాటా పదివేల కోట్లను భరించడానికి కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం
ఇటీవల శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రాజెక్టు పైన ముఖ్యమైన ప్రకటన చేశారు. రాయలసీమ ఉద్యాన హబ్ లో రాష్ట్ర వాటా పదివేల కోట్లను భరించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 40 వేల కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో సుమారు 8.41 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి.

2030 నాటికి దీనిని 14.41లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యం
ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి దీనిని 14.41లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో దాదాపు తొమ్మిది లక్షల మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఉద్యానవన పంటల సాగు మరియు అభివృద్ధికి సుమారు 14 వేల 906 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలుగా ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నారు.
రూ.20,884.35 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
రాబోయే మూడు సంవత్సరాలలో దాదాపు 5869 గ్రామాలకు ఈ పథకం ద్వారా ఉద్యానవన వైభవాన్ని తీసుకురానున్నారు. నీటి వసతి విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టింది. వెలిగొండ వంటి ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు సుమారు రూ.20,884.35 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా దాదాపు 12.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
303మండలాల్లో 200కంటే ఎక్కువ ఉద్యానవన క్లస్టర్లను ఏర్పాటు
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటిని పొదుపు చేస్తూ అధికలాభాలు సాధించేలా ప్రణాళిక రూపొందించారు. అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల, తిరుపతి మరియు ప్రకాశం జిల్లాల్లోని 303మండలాల్లో 200కంటే ఎక్కువ ఉద్యానవన క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అరటి, బత్తాయి, మామిడి, పసుపు వంటి పంటలకు మంచి గిట్టుబాటుధర కల్పించడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు రోడ్లు, రైలుమార్గాలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు.
కేంద్రం నుంచి అవకాశమున్న ప్రతి రూపాయిని తెచ్చుకుంటాం
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి అవకాశమున్న ప్రతి రూపాయిని తెచ్చుకుంటూ బాధ్యతగా ఖర్చు పెడుతున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతున్నామని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసిన ప్రజలకు అండగా నిలిచేలా కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ రైతులకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications