ఆ వసూళ్ళపై స్పెషల్ డ్రైవ్.. వారికి డీజీపీ మాస్ వార్నింగ్!
ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఒకప్పుడు సమాజంలో వివక్షకు గురయ్యేది.కానీ ఇప్పుడు ప్రభుత్వం వారికి అండగా నిలవటం, వారికి ఉపాధి అవకాశాలను కల్పించటం వంటి చర్యలను తీసుకోవటం తో ఇప్పుడు ఆ సమస్య లేదు. గతంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేనప్పుడు రైళ్ళలో, బస్టాండ్ లవద్ద, ఫంక్షన్ లలో వారు డబ్బులు వసూళ్ళకు పాల్పడే వారు.కొన్ని చోట్ల ఆ సమస్య తగ్గింది.
రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ లపై స్పెషల్ డ్రైవ్
కానీ కొన్ని చోట్ల కొంతమంది ముఖ్యంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభోత్సవాలు వంటి శుభకార్యాల సందర్భంగా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో వీరిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. బలవంతపు వసూళ్లు, వేధింపులు, బెదిరింపులను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్ని పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు సూచించనున్నట్లు ఆయన తెలిపారు.

ట్రాన్స్ జెండర్ లపై పెరుగుతున్న ఫిర్యాదులు
ఇటీవల హైదరాబాద్లోని చింతల్ ప్రాంతంలో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో రూ.50 వేల వరకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. డబ్బులు ఇవ్వలేమని చెప్పగానే అసభ్యంగా ప్రవర్తించారని వారు లబోదిబోమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. అదేవిధంగా బిగ్బాస్ ఫేమ్ యాంకర్ అరియానా గ్లోరీ కూడా తన గృహప్రవేశ సమయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
బలవంతపు వసూళ్లపై ప్రత్యేకడ్రైవ్
రూ.25 వేలు నుంచి లక్షకుపైగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు మొత్తం ట్రాన్స్జెండర్ సమాజాన్ని ఉద్దేశించినవి కావని, కేవలం బలవంతపు వసూళ్ల సమస్యపైనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ అంశంపై స్పందిస్తూ, తాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలోనూ ఇలాంటి భిక్షాటన రాకెట్లు, బలవంతపు వసూళ్లపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు గుర్తుచేశారు.
కఠిన చర్యలకు డీజీపీ ఆదేశం
ప్రస్తుతం మళ్లీ ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో అదే తరహా చర్యలు అవసరమని పేర్కొన్నారు. బెదిరింపులు, దాడులు, బలవంతపు వసూళ్లకు పాల్పడినవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్ సమాజాన్ని సమాజంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా డీజీపీ ప్రస్తావించారు.
గౌరవ ప్రదమైన జీవితం కావాలంటే మీ కోసం అవకాశాలు ఉన్నాయన్న డీజీపీ
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, హైడ్రా వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించగా, వారు ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గౌరవప్రదమైన జీవనం కోసం ముందుకు వచ్చే వారికి అవకాశాలు కల్పించేందుకు పోలీసులు కూడా సహకరిస్తారని ఆయన అన్నారు. అయితే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
