గంగా ఎక్స్ప్రెస్ వే.. గంగార్పణం: ఒక్క వర్షానికే ఢమాల్.. !!
ఉత్తర్ ప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గంగా ఎక్స్ప్రెస్వే భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ఎక్స్ప్రెస్వే పలుచోట్ల దెబ్బతిన్నది. ఇది విస్మరించకముందే ఉత్తర్ ప్రదేశ్ లోనే ఉన్నవ్ జిల్లా పరిధిలో మరో ఎక్స్ప్రెస్ కుంగిపోయింది. రహదారుల భద్రత, వాటి నిర్మాణంలో డొల్లతనం ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ పరిణామాలు ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రారంభమైందీ భారీ ఎక్స్ప్రెస్వే. ఈ నాలుగు నెలల కాలంలోనే ఇలా దెబ్బతినడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు అనుసంధానించే ఈ రహదారిలో ఉన్నవ్ జిల్లా సోనిక్ ప్రాంతం పరిధిలో 421 కిలోమీటర్ వద్ద గల ఇది భారీగా కుంగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డు పక్క భాగం కొట్టుకుపోయింది.

రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ర్యాంప్ వద్ద మట్టి, గ్రావెల్.. వర్షపు నీటి ఉధృతికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. రోడ్డు కుంగిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుమారు 37,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ గంగ ఎక్స్ప్రెస్వే నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ సంస్థ ఈ స్ట్రెచ్ నిర్మాణ పనుల బాధ్యతలను చేపట్టినట్లు సమాచారం.
సోనిక్ ప్రాంతంలో దెబ్బతిన్న గంగా ఎక్స్ప్రెస్వే మరమ్మతు పనులు కొనసాగుతుండగానే.. దహి చౌకీ- బషీరత్గంజ్, హసన్పూర్- ఫయాజ్నగర్, సహ్దారా మిలక్ గ్రామాల సమీపంలో కూడా రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. సరాయ్ కతియాన్ కెనాల్ సమీపంలో రోడ్డు అంచులు దెబ్బతిన్నాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులను సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వంతెన ఎక్స్ప్యాన్షన్ జాయింట్ల వద్ద ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు సాగుతున్నాయి. రోడ్డు కుంగిన భాగాన్ని సరిచేయడానికి అవసరమైన యంత్రాలు, సామాగ్రిని రంగంలోకి దించారు. ఈ ఎక్స్ ప్రెస్ వే కు సమాంతరంగా నిర్మించిన డ్రైనేజీ కాలువలు కూడా చాలా చోట్ల ధ్వంసమైనట్లు గుర్తించారు. దీని కారణంగానే నీరు లీక్ అయిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల గంగా ఎక్స్ ప్రెస్ వే దెబ్బతినడంపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ఘాటుగా స్పందించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది. గంగా ఎక్స్ప్రెస్వే నిర్మాణ నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉందనడానికి ఈ ఘటనలే సాక్ష్యమని ఆరోపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కమీషన్ల కోసమే పనులను నాసిరకంగా పూర్తి చేశారని సమాజ్ వాది పార్టీ నేతలు విమర్శించారు.














Click it and Unblock the Notifications