చిత్తూరు: తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓటర్లు రెచ్చిపోయి ఓట్లు వేశారని, ఇందుకు అధికారగణం కూడా సహకరించారనే ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. తాజాగా, తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ వద్ద చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందని, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్నారు సోము వీర్రాజు. శనివారం జరిగిన దొంగ ఓట్ల ఘటనపై సీఎం జగన్.. జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్ల విషయంలో ప్రజలకు అబ్ధాలు చెప్పారని సోము వీర్రాజు మండిపడ్డారు.
మరోవైపు జనసేన కూడా తిరుపతి ఉపఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. తిరుపతి లోక్సభ ఉపఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల సాయంతో రిగ్గింగ్ కు పాల్పడ్డారన్నారు. దొంగ ఓట్లు వేయడం కూడా నవరత్నాల్లో భాగమేనా? అని సీఎం జగన్మోహన్ రెడ్డిని నాదెండ్ల ప్రశ్నించారు. వైసీపీ అక్రమాలపై బీజేపీతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
మరిన్ని తిరుపతి వార్తలు
ఇది ఇలావుంటే, దొంగ ఓట్లపై సీఎం జగన్ సమాధానం చెప్పాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీని దొంగ ఓట్లు, నోట్ల రాజ్యంగా చేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దొంగలపాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని ఆరోపించారు. నకిలీ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా అని ప్రశ్నించారు. పోలింగ్ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయి? కేసులు నమోదైన 12 మంది అధికారులు వైసీపీకి చెందినవారు కాదా? దొంగ ఓటర్లంతా మంత్రులు పంపిన వైసీపీవాళ్లు కాదా? అని యనమల ప్రశ్నించారు.
డీజీపీ వెనక్కి పంపామని చెప్పిన 250 బస్సులు ఎవరివి? బస్సుల్లో వచ్చినవారంతా ఎవరు? 144 సెక్షన్ విధిస్తే ఫంక్షన్ హాళ్లలో, రోడ్లపై వేల మంది ఎలా చేరారు? అని యనమల నిలదీశారు. ఓటమి భయంతోనే దొంగ ఓట్లు, దొంగ నోట్లతో జగన్ జిత్తులు వేశారన్నారు. తమ ఫిర్యాదులపై వెంటనే సీఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.