Advertisement

గుంటూరు డిగ్రీ విద్యార్థిని హత్యోదంతంపై దుమారం: స్పందించిన జగన్: 21 రోజుల్లో నిందితుడికి..!


గుంటూరు: గుంటూరు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యోదంతం.. కలకలం రేపుతోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ హత్యకేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినదిస్తున్నారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. అనూష హత్యోదంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన తనను కలిచి వేసిందిన ఆయన వ్యాఖ్యానించారు. నిందితుడిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన ఆదేశించారు. హతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

ప్రేమ పేరుతో వేధింపులు..

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూష బుధవారం సాయంత్రం హత్యకు గురైన విషయం తెలిసిందే. నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఆమె రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె క్లాస్‌మేట్ విష్ణువర్ధన్‌రెడ్డి కొంతకాలంగా ప్రేమ పేరుతో అనూషను వేధిస్తుండేవాడు.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం పమిడిపాడు అతని స్వగ్రామం. అనూష కళాశాలకు వెళ్తోండగా విష్ణువర్ధన్‌ రెడ్డి ఆమెను అడ్డగించాడు. మాట్లాడాలంటూ అనూషను ఆటోల బలవంతంగా ఎక్కించుకుని పాలపాడు రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

గొంతు నులిమి హత్య..

ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తనను ప్రేమించాల్సిందేనంటూ అతను పట్టుబట్టినప్పటికీ.. అనూష అంగీకరించలేదు. దీనితో ఆమెపై విష్ణువర్ధన్‌ రెడ్డి దాడి చేశాడు, గొంతు నులిమి హత మార్చాడు. మృతదేహాన్ని గోవిందపురం వద్ద కాలువలో పడేశాడు. అనంతరం ఆమె తల్లికి ఫోన్ చేసి, అనూషను హత్య చేసినట్లు చెప్పాడు. పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. అనూష మృతదేహాన్ని పడేసిన స్థలం గురించి వారికి వివరించాడు. పోలీసులు అనూష మృతదేహాన్ని కాలువ నుంచి వెలికితీసి, పోస్ట్‌మార్టమ్ కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
మృతదేహంతో ఆందోళన..

ఈ విషయం తెలిసిన వెంటనే నరసరావు పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువరు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చదలవాడ అరవింద్ బాబు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతురాలి కుటుంబీకులు, బంధువులతో కలిసి ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పల్నాడు రోడ్డులోని మయూరి లాడ్జి సెంటర్‌కు తీసుకెళ్లి రాస్తారోకో చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు ఆందోళన కొనసాగింది. విష్ణువర్ధన్‌రెడ్డిని తక్షణమే కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా..

ఈ విషయం తెలుసుకున్న వెంటనే సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టి 21 రోజుల్లో శిక్ష పడేలా చేయాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని ఆదేశించినట్లు తెలిపారు. వారు ఇచ్చిన హామీతో అనూష కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. అనూష మరణవార్త నేపథ్యంలో కృష్ణవేణి కళాశాలపై విద్యార్థులు రాళ్లతో దాడి చేశారు.

English Summary

AP CM Jagan announces ex gratia of Rs 10 lakh to Degree student Anusha, who was murdered by her classmate in Narasaraopet of Guntur district on Wednesday.
Read more...