Viral Video: తల్లి సైతం సాహసించని వేళ: రైలుకు ఎదురెళ్లి..చిన్నారి ప్రాణాన్ని కాపాడి!


ముంబై: వేగంగా దూసుకొస్తోన్న రైలుకు ఎదురెళ్లి మరీ.. ప్రాణాలను కాపాడే సన్నివేశాలను మనం రీల్ మీదే చూస్తుంటాం. హీరో చేసిన సాహసానికి చప్పట్లు కొడతాం.. ఈలలు వేసి థియేటర్‌లో గోల గోల చేస్తుంటాం. అచ్చంగా అలాంటి దృశ్యమే ఓ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. హాల్ట్ లేని రైల్వే స్టేషన్ గుండా వాయువేగంతో దూసుకెళ్తోన్న ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లి మరీ.. ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు ఓ పాయింట్స్‌మెన్. పట్టాలపై పడి ఉన్న తన సంతానాన్ని కాపాడుకోవడానికి తల్లి సైతం సాహసించలేకపోయింది.

అలాంటిది- మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చిన ఆ పాయింట్స్‌మెన్ ఆ చిన్నారిని కాపాడాడు. సకాలంలో పట్టాల మీది నుంచి ప్లాట్ ఫామ్ మీదికి చేర్చగలిగాడు. సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని రైల్వే అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పాయింట్స్‌మెన్‌ను రియల్ హీరోగా కీర్తిస్తున్నారు. కోట్లాదిమంది స్ఫూర్తిగా నిలిచాడని ప్రశంసిస్తున్నారు.

ఆ పాయింట్స్‌మెన్ పేరు మయూర్ షెల్కె. ముంబై డివిజన్ పరిధిలోని వంగణీ రైల్వేస్టేషన్‌లో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద తన విధి నిర్వహణలో ఉన్నారాయన. ఓ మహిళ నాలుగేళ్ల బాలుడితో కలిసి ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చాడు. అదుపు తప్పి ప్టాట్‌ఫామ్ మీది నుంచి పట్టాల మీద పడిపోయాడు. అదే సమయంలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అటు వైపు దూసుకొచ్చింది. ఆ రైలుకు ఆ స్టేషన్‌లో హాల్ట్ సౌకర్యం లేదు. అందుకే- వేగం ఏ మాత్రం తగ్గలేదు.

Advertisement
Advertisement

పట్టాలపై పడి ఉన్న బాలుడిని కాపాడటానికి ఆ మహిళ ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కళ్లెదురుగానే రైలు దూసుకొస్తుండటంతో పట్టాలపైకి దిగడానికి సాహసించలేదు. దీన్ని గమనించిన మయూర్ షెల్కె.. పట్టాలపై రైలుకు ఎదురుగా వాయువేగంతో పరుగెత్తాడు. రైలు రావడానికి కొన్ని సెకెన్ల ముందు ఆ బాలుడిని ప్లాట్‌ఫామ్ మీదికి చేర్చాడు. తానూ అక్కడి నుంచి బయటపడ్డాడు. మయూర్ షెల్కె ప్లాట్ ఫామ్ మీదకి రావడం.. ఆ వెంటనే రైలు అతణ్ని దాటుకుంటూ దూసుకెళ్లడం వెంట్రుకవాసిలో చోటు చేసుకుంది.

ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీన్ని రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మయూర్ సాహసాన్ని ప్రశంసించింది. దీనిపట్ల నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రియల్ హీరోగా ఆయనను అభివర్ణిస్తున్నారు. ముంబై రైల్వే డివిజనల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారులు మయూర్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఆయనకు రివార్డ్ ఇవ్వాలంటూ రెకమెండ్ చేస్తామని తెలిపారు.

Read more...

English Summary

Maharashtra: A pointsman in Mumbai Division, Mayur Shelkhe saves life of a child who lost his balance while walking at platform 2 of Vangani railway station & fell on railway tracks, while a train was moving in his direction.