Congress-TVK: విజయ్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటన..! వాళ్లను చేర్చుకోరాదనే షరతు..!
తమిళనాడులో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ (vijay) టీవీకే (Tvk) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మెజార్టీకి అవసరమైన 10 సీట్ల కోసం జరుపుతున్న సంప్రదింపుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) మద్దతు కోరింది. దీంతో విజయ్ పార్టీ కోరిన మీద తాము షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఓ లేఖ విడుదల చేసింది.
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ మద్దతును అందించాలని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్.. తమను లాంఛనంగా కోరారని కాంగ్రెస్ తెలిపింది. తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత, రాజ్యాంగ సూత్రాలను విశ్వసించే లౌకిక, ప్రగతిశీల, సంక్షేమ ప్రభుత్వానికి చాలా స్పష్టమైన, బలమైన, అఖండమైన తీర్పును ఇచ్చారని, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు విజయ్ నాయకత్వంలోని టీవీకేను ఎంచుకున్నారని తెలిపింది. కాంగ్రెస్ దేశంలోని , ప్రగతిశీల, సంక్షేమ రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తుందని, వాటికి వ్యవస్థాపక రాజకీయ పార్టీగా ఉందని వెల్లడించింది. ప్రజల ఆదేశాన్ని గౌరవించడం, సమర్థించడం, నెరవేర్చడంలో సహాయపడటం మన రాజ్యాంగ విధి అని పేర్కొంది.

తదనుగుణంగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు తమ పూర్తి మద్దతును అందించాలని నిర్ణయించాయని తెలిపింది. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి టీవీకే దూరంగా ఉంచితేనే తమ మద్దతు వర్తిస్తుందని షరతు పెట్టింది. టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఏర్పడిన ఈ పొత్తు, రాబోయే సంవత్సరాలు, దశాబ్దాలలో తండై పెరియార్ సాంఘిక న్యాయ ఆదర్శాలకు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ ఆదర్శాలకు గట్టి నిబద్ధతతో, పెరుంతలైవర్ కామరాజ్ తమిళనాడు వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తుందని తెలిపింది. పరస్పర గౌరవం, సముచిత వాటా, ఉమ్మడి బాధ్యతపై ఆధారపడిన ఈ పొత్తు, కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాకుండా, భవిష్యత్తులో స్థానిక సంస్థల, లోక్సభ, రాజ్యసభలకు జరిగే ఎన్నికల కోసం కూడా కొనసాగుతుందని తెలిపింది. లౌకిక, ప్రగతిశీల ప్రభుత్వం కోసం తమిళనాడు ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తామని, ప్రజల - ముఖ్యంగా తమిళనాడు యువత యొక్క - కలలు, వాగ్దానాలను నెరవేరుస్తామని విజయ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని కాంగ్రెస్ తెలిపింది.














Click it and Unblock the Notifications