AIADMK కు మెజారిటీ సీట్లు: అయినా గానీ
తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.
తాజాగా వెలువడిన ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి 114 నుండి 124 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. డీఎంకే కూటమికి 103 నుండి 113 సీట్లు, విజయ్ టీవీకేకు 4 నుండి 10 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. ఓట్ల శాతాల విషయానికి వస్తే.. అన్నాడీఎంకేకు 39.9 శాతం ఓట్లు పోల్ అవుతాయి. డీఎంకేకు 38.9, టీవీకేకు 15.8, ఇతర పార్టీలకు 3.5 శాతం ఓట్లు లభించవచ్చని సర్వే వెల్లడించింది.

రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరిగింది. తుది ఓటర్ల జాబితా ప్రకారం 5.73 కోట్ల మంది ఓటర్లలో 85.15% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, నామ్ తమిళర్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. రామదాస్-శశికళ ఒక ప్రత్యేక కూటమిగా, కృష్ణస్వామి స్వతంత్రంగా బరిలో నిలవగా, మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం. నటుడు విజయ్ ఈ ప్రధాన పార్టీలకూ గట్టి సవాలు విసిరారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య కేవలం ఒకశాతం ఓట్ల తేడా ఉండటంతో, విజయం, ఓటమి మధ్య అంతరం చాలా స్వల్పంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యాక్సిస్ మైఇండియా అంచనాలు మరింత విభిన్నంగా టీవీకేకు అనూహ్య విజయాన్ని సూచించాయి. డీఎంకే+ కు 92-110, ఏఐఏడీఎంకేకు 22-32 సీట్లు లభిస్తాయి. విజయ్ టీవీకేకు ఏకంగా 98-120 సీట్లు వస్తాయని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications