తమిళనాడులో విజయం ఆ పార్టీదే.. ఒక్క పోస్టుతో త్రిష సంచలనం..!!
తమిళనాడులో ఏప్రిల్ 23 న ఓటింగ్ పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు చరిత్రలోనే లేనంతగా పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగ్గా సాయంత్రం 6 గంటల వరకు 84.41 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమిళనాడులో అత్యధిక శాతం పోలింగ్ ఇదేనని ఈసీ వెల్లడించింది. ఓవైపు ఎండలు మండిపోతున్నా ఓటర్లు ఏమాత్రం లెక్కచేయకుండా లైన్లలో బారులు తీరి మరీ ఓట్లు వేశారు. 2011లో నమోదైన 78.29 శాతమే ఇప్పటివరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం కాగా ఆ రికార్డు తాజాగా బద్దలైంది.
ఇక తమిళనాడులోని సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అయితే విజయ్ ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. దాంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య విజయ్ ను అక్కడి నుంచి తరలించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ కుమార్, కమల్ హాసన్, ధనుష్, శివ కార్తికేయన్ తదితర సినీ ప్రముఖులు తెల్లవారుజామునే క్యూ లైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తమిళ స్టార్ హీరోయిన్ త్రిష సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తల్లితో కలిసి త్రిష చెన్నైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఓటు వేసిన అనంతరం వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు.

ఓటు వేసిన తర్వాత త్రిష తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాను ఓటు వేసినట్లు వేలు చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను పెట్టారు. అందుకు బ్యాక్ గ్రౌండ్ లో తాను విజయ్ తో నటించిన గిల్లి సినిమాలోని అర్జునర్ విల్లు పాటను జత చేశారు. అయితే ఆ పాటలో కేవలం విజిల్ వచ్చే భాగాన్ని మాత్రమే ఆమె ఎంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక విజయ్ పార్టీ సింబల్ కూడా విజిల్ కావడంతో.. త్రిష పరోక్షంగా విజయ్ పార్టీకి ఫుల్ మద్దతు ఇచ్చినట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక విజయ్- త్రిష గురించి ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4 న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications