ప్రముఖ నటితో విజయ్ సర్ ప్రైజ్: షిర్డీ సాయిబాబా ఆలయంలో..!!
తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ కూడా మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ నూతన రాజకీయ శక్తిగా రంగప్రవేశం చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా, ఫలితాలను తారుమారు చేయగలిగుతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల మధ్య విజయ్.. నేడు మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ సాయిబాబాఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రపు హారతిలో పాల్గొన్నారు. నీలం రంగు షర్ట్, నుదుట గంధపు బొట్టును ధరించి కనిపించారు విజయ్. ఈ ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. షిర్డీ సమీపంలోని కాకడీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిబాబా సమాధికి శిరస్సు వంచి నమస్కరించారు. అక్కడే కొంతసమయం పాటు కూర్చున్నారు. ఆ సమయంలో ఆయన వెంట టీవీకేకు చెందిన కొందరు ముఖ్య నాయకులు ఉన్నారు. సుమారు గంట పాటు ఆలయంలోనే ఉన్నారు విజయ్ ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో సాయిబాబా ఆలయంలో ప్రముఖ మలయాళ నటి కనిహ కనిపించారు. విజయ్ ను ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో సెల్ఫీ దిగారు. బెస్ట్ విషెస్ చెప్పారు. కాగా రెండు రోజుల వ్యవధిలో ఆలయాలను సందర్శించడం విజయ్ కు ఇది రెండోసారి. మంగళవారం నాడు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ లో సుబ్రహ్మణ్య స్వామివారు వెలిసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications