రూ. 31 లక్షల కోట్ల సంపద.. ఒకే ఒక్క ఎన్నిక! తమిళనాడు జాతకం మారబోతోందా?
తమిళనాడు రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక చర్చ.. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కాజగం' (TVK) రాష్ట్ర భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఏప్రిల్ 23న ముగిసిన ఎన్నికల పోలింగ్ తర్వాత, మే 4న వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే, ఇది కేవలం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు; రూ. 31.19 లక్షల కోట్ల భారీ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగుతున్న ద్విధ్రువ రాజకీయాల్లోకి విజయ్ 'ఒంటరి' పోరాటం ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
రాష్ట్ర ఆర్థిక సర్వే 2025-26 గణాంకాలను పరిశీలిస్తే, తమిళనాడు ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా ఉన్నాయి. గడిచిన 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 11.19 శాతం వాస్తవ వృద్ధిరేటును నమోదు చేసి, దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ భూభాగంలో 4 శాతం, జనాభాలో 6 శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. జాతీయ జీడీపీకి తమిళనాడు 9.4 శాతం తోడ్పడటం విశేషం. ముఖ్యంగా తయారీ రంగం 14.74 శాతం వృద్ధిని సాధించి, జాతీయ సగటు (4.5%) కంటే మూడు రెట్లు వేగంగా దూసుకుపోతోంది. హ్యుందాయ్ షిప్యార్డ్, రోల్స్ రాయిస్ మెయింటెనెన్స్ సెంటర్, ఫాక్స్కాన్ విస్తరణ వంటి అంశాలు తమిళనాడు పారిశ్రామిక శక్తికి నిదర్శనం.

రాజకీయ అస్థిరత - ఇన్వెస్టర్ల ఆందోళన..
అయితే, ఈ అద్భుతమైన వృద్ధి పథానికి రాజకీయ అస్థిరత అడ్డుగోడగా మారుతుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓట్ల చీలిక ప్రధాన పార్టీలైన డీఎంకే లేదా అన్నాడీఎంకేలకు స్పష్టమైన మెజారిటీని దూరం చేస్తే, రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలు మొదలవుతాయి. ఒకవేళ టీవీకే 'కింగ్మేకర్' పాత్ర పోషించాల్సి వస్తే, ఆ పార్టీకి పారిశ్రామిక విధానం, భూసేకరణ సంస్కరణలు లేదా ఇన్వెస్టర్ల ఫ్రెండ్లీ వాతావరణంపై ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోవడం పెట్టుబడిదారులను కలవరపెట్టే అంశం.
సంక్షేమం వర్సెస్ ఆర్థిక స్థిరత్వం..
మరోవైపు, తమిళనాడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'సంక్షేమం వర్సెస్ ఆర్థిక స్థిరత్వం'. 'నాన్ ముధల్వన్', 'పుధుమై పెన్', 'కళైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తిట్టం' వంటి పథకాల వల్ల సామాజిక రంగ వ్యయం రూ. 1.57 లక్షల కోట్లకు చేరింది. ఇవి మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరిచినప్పటికీ, ఎన్నికల వేళ ప్రతి పార్టీ మరిన్ని ఉచిత పథకాలు, నగదు బదిలీల హామీలు గుప్పించాయి. ఈ హామీల భారం రాష్ట్ర ఖజానాపై పడితే, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత ఏర్పడవచ్చు. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే పారిశ్రామిక వృద్ధిని కాపాడుకోవడం అనేది రాబోయే ప్రభుత్వానికి కత్తి మీద సాము వంటిదే.
నిర్దేశించనున్న మే 4 ఫలితాలు..
తుది ఫలితాల్లో వచ్చే మెజారిటీ మార్జిన్ రాబోయే ఐదేళ్ల తమిళనాడు గమనాన్ని నిర్దేశిస్తుంది. డీఎంకేకు స్పష్టమైన మెజారిటీ లభిస్తే అది విధానాల కొనసాగింపుగా మార్కెట్లు భావిస్తాయి. అన్నాడీఎంకే కూటమి గెలిస్తే కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో మార్పులు ఉండవచ్చు. కానీ, ఒకవేళ టీవీకే ఓట్ల శాతాన్ని భారీగా చీల్చి అస్థిరమైన తీర్పు వస్తే మాత్రం, అది కేవలం రాజకీయ సంక్షోభానికే పరిమితం కాకుండా, దేశానికే గ్రోత్ ఇంజిన్గా ఉన్న తమిళనాడు ఆర్థిక వేగాన్ని మందగించేలా చేస్తుంది. మే 4న వెలువడే ఫలితాలు కేవలం ఒక నాయకుడి విజయాన్ని మాత్రమే కాదు, దక్షిణ భారత్ ఆర్థిక ముఖచిత్రం ఏ దిశగా సాగుతుందో కూడా ఆవిష్కరించనున్నాయి.












Click it and Unblock the Notifications