కుప్పకూలిన టాప్ అమెరికన్ ఎయిర్ లైన్స్- అగమ్యగోచరం
అమెరికాకు చెందిన బడ్జెట్ ఎయిర్లైన్ స్పిరిట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆర్థిక సహాయం లభించకపోవడంతో ఇది మూసివేత అంచున నిలిచింది. దాదాపుగా విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసింది ఇప్పటికే. తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయాలకు రావద్దని సంస్థ కోరింది.
తన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా పునర్నిర్మించడానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కొన్ని నెలలుగా స్పిరిట్ ఎవియేషన్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సాగిస్తూ వచ్చిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీ కోసం డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో సాగించిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఇరాన్ తో యుద్ధం, హార్ముజ్ జలసంధి ఇబ్బందులు, అమెరికా విధించిన బ్లాకెడ్ వంటి పరిణామాల వల్ల అమెరికాలో ఇటీవలి కాలంలో చమురు ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.

ఇది స్పిరిట్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సంస్థ కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన అదనపు నిధులను పొందలేకపోయింది. దీంతో దివాళా తీయాల్సి వచ్చింది. సంస్థను మూసివేస్తోన్నామని స్పిరిట్ ఎయిర్లైన్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవ్ డేవిస్ వెల్లడించారు. 30 సంవత్సరాలకు పైగా స్పిరిట్ ఎయిర్లైన్స్ లక్షలాదిమంది ప్రయాణికులకు సేవలను అందించిందని, లోబడ్జెట్ లో ఛార్జీ సౌకర్యాన్ని కల్పించిందని గుర్తు చేశారు.
ఈ మధ్యకాలంలో ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, క్రమబద్ధంగా తమ సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని డేవ్ డేవిస్ చెప్పారు. సంస్థ మనుగడ సాగించాలంటే వందల మిలియన్ల అదనపు డాలర్ల లిక్విడిటీ అవసరమని, ఆ సామర్థ్యం తమ సంస్థకు లేదని, అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎటువంటి సహాయాన్ని పొందలేకపోయామని అన్నారు. దీంతో సర్వీసులను రద్దు చేస్తోన్నామని తేల్చి చెప్పారు.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి నేరుగా కొనుగోలు చేసిన టిక్కెట్ల కోసం సంస్థ ఆటోమేటిక్ రీఫండ్ అందిస్తుంది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న వారు రీఫండ్ల కోసం వారిని సంప్రదించాల్సిందిగా కోరింది. వోచర్లు, క్రెడిట్లు లేదా లాయల్టీ పాయింట్లను ఉపయోగించి చేసిన బుకింగ్లకు సంబంధించి పరిహారాన్ని దివాలా ప్రక్రియ ద్వారా తర్వాత నిర్ణయిస్తారు.
స్పిరిట్ మూసివేత వల్ల సుమారు 17,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోతారని సంస్థ అడ్వొకేట్ మార్షల్ హ్యూబ్నర్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు స్పిరిట్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ముడి చమురు బ్యారెల్కు 126 డాలర్లకు మించి చేరడంతో ఇంధన ధరలు పెరిగాయి. అనేక ఎయిర్లైన్స్ నష్టపోతున్నాయి; ధరల నియంత్రణకు చాలా సంస్థలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.












Click it and Unblock the Notifications