హైదరాబాద్ జూ పార్కులోకి అరుదైన జంతువు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..!!
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నెహ్రూ జూపార్కులో ఇప్పటికే అనేక జంతువులు, పక్షులు ఉన్నాయి. నగర వాసుల కోసం ఎప్పటికప్పుడు కొత్త జంతువులను, పక్షులను ఇతర సరీసృపాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో సాధారణంగా జూ పార్క్ కు వచ్చేవారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇక తాజాగా యానిమల్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇతర జూ పార్క్ ల నుంచి అరుదైన జంతువులు, పక్షులను తీసుకురానున్నారు అధికారులు. ఈ విషయాన్ని తెలంగాణ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎలుసింగ్ మేరు తెలిపారు. ఇక నెహ్రూ జూ పార్క్ లోని కొత్తగా తీసుకొస్తున్న జంతువుల్లో జీబ్రాలు, వాల్లబీస్, మాండ్రిల్స్, గిబ్బాన్స్ తో పాటు ఇతర మరికొన్ని జంతువులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఇతర జూ పార్కుల నుంచి తీసుకొచ్చిన ఈ జంతువులను వెంటనే పర్యటకుల సందర్శనకు ఉంచకుండా 45 రోజుల పాటు ఇక్కడి వాతావరణాన్ని అలవాటు పడేందుకు క్వారెంటైన్ లో ఉంచుతారు. ఆ తర్వాతే ఈ జంతువులను చూసేందుకు ప్రజలను అనుమతిస్తారు. పూర్తిగా ఆ జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకే అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇక ఇటవల నెహ్రూ జూ పార్క్ లోకి మాండ్రిల్స్ కోతులు వచ్చిన విషయం తెలిసిందే.
ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వాటిని జంషేద్ పూర్ జూ నుంచి తీసుకొచ్చారు. అందుకు బదులుగా మన దగ్గర ఉన్న ఒక జత ఆఫ్రికన్ సింహాలను అక్కడకు తరలించారు. ఇలా ఒక జూ పార్క్.. మరో జూ పార్క్ తో ఎక్స్ ఛేంజ్ కార్యక్రమంలో ఏళ్ల తరబడి నడుస్తోంది. ఇక నెహ్రూ జూ పార్క్ లోకి కొత్త జంతువులు వచ్చిన సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అందులోనూ వేసవి సెలవులు కావడంతో రానున్న రోజుల్లో పర్యటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు వేసవి కారణంగా జూ పార్క్ లోని జంతువులు, పక్షులు, మొసళ్లు, సరీసృపాలు ఇబ్బంది పడకుండా వాటికి ఎప్పటికప్పుడు నీటి సదుపాయం కల్పించడంతో పాటు పైపులతో స్నానం చేపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జంతువులు ఉన్న ప్రదేశాల వద్ద స్ప్రింక్లర్స్, మిని రెయిన్ గన్స్, కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్న తరుణంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జంతువులకు వడదెబ్బ తగలకుండా అవి తాగే నీటిలో విటమిన్ సీ, బీ కాంప్లెక్స్ మందులను కలిపి ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మీర్ ఆలం ట్యాంక్ కు దగ్గరలోని బహదూర్ పురాలో ఉంది. ఈ జూ పార్క్ కు చాలా ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ పార్కు దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జూ పార్కును ప్రతి సోమవారం మూసివేస్తారు. మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచే ఉంచుతారు. టికెట్ ధరల విషయానికి వస్తే పెద్దలకు ( అంటే 12 సంవత్సరాల పైబడిన వాళ్లు) రూ. 100 ఉంది. అలాగే పిల్లలకు ( అంటే 3 నుంచి 12 సంవత్సరాల లోపు వాళ్లు) రూ. 50 గా ఉంది.












Click it and Unblock the Notifications