ఏఐతో సగం బ్యాంక్ ఉద్యోగాల్లో మార్పులు ? బీసీజీ సంచలన రిపోర్ట్ ..!
కృత్రిమ మేథ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏఐ రాకతో ఎన్నో రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల రూపురేఖలు మారిపోవడమో లేక పూర్తిగా మాయం కావడమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో భారతీయ బ్యాంకింగ్ రంగంలోనూ ఏఐ రాకతో పెను మార్పులు తప్పవని తేలింది. ముఖ్యంగా బ్యాంకుల్లో సగం ఉద్యోగాల రూపురేఖలు మారబోతున్నాయట.
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలపై కృత్రిమ మేథ ప్రభావం కనిపిస్తోంది. ఏఐను వాడుకుంటూ ఉద్యోగాలను తొలగించేందుకు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాంకింగ్ రంగంలోనూ ఏఐ ప్రభావం తప్పదని బీసీజీ గ్రూప్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. గత దశాబ్దంలో బ్యాంకుల సమాచార సాంకేతిక వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, ఉత్పాదకతలో లాభాలు పరిమితమే అని బోస్టన్ గ్రూప్ రిపోర్ట్ తేల్చేసింది.

భారతీయ బ్యాంకులకు వాస్తవ ఉత్పాదకత లాభాలను కేవలం 1 శాతంగా బోస్టన్ గ్రూప్ అధ్యయనం అంచనా వేసింది. అలాగే దేశంలోని రుణదాతలు తమ ప్రపంచ సహచరుల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపింది. పరిమిత ఉత్పాదకత లాభాల వల్ల ఎదురయ్యే సవాలును అధిగమించడానికి ఏఐను స్వీకరించడం బ్యాంకులకు సాయపడుతుందని పేర్కొంది. ఇప్పటికే పలు బ్యాంకులు ఏఐ టూల్స్ ను వాడుతున్న విషయాన్ని గుర్తుచేసింది.

బ్యాంకులు ఈ కొత్త టెక్నాలజీని ధైర్యంగా స్వీకరించగలిగితే దాదాపు 35-50 శాతం ఉద్యోగాల్లో మార్పులు చేసుకోవచ్చని బీసీజీ గ్రూప్ రిపోర్ట్ లో తెలిపింది. అలాగే బ్యాంకింగ్ రంగం గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా ఏఐ వల్ల పరిష్కారం లభించవచ్చని బోస్టన్ గ్రూప్ అంచనా వేస్తోంది. దీంతో ఈ రిపోర్ట్ పై బ్యాంకింగ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకుల్లో ఏఐ వాడకం కారణంగా ఉద్యోగాల రూపురేఖలు మారిపోతే ఆ ప్రభావం వినియోగదారులపైనా ఉండబోతోంది.












Click it and Unblock the Notifications