పరిశ్రమలో ఇప్పుడు జరుగుతున్న గొడవను ముందే పసిగట్టిన సురేష్బాబు, అల్లు అరవింద్
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న 'పర్సంటేజీ వార్' ఒకెత్తయితే, ఈ గొడవలో ఇండస్ట్రీ పెద్దల మౌనం మరొకెత్తు. మైత్రీ రవిశంకర్, సితార నాగవంశీ వంటి నిర్మాతలు ఒకవైపు.. శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ వంటి ఎగ్జిబిటర్లు మరోవైపు మాటల యుద్ధం చేసుకుంటుంటే, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి సీనియర్ నిర్మాతలు మాత్రం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే పెద్దన్నలుగా అల్లు అరవింద్, సురేష్ బాబులకు పేరుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చలో వారి పేర్లు ఎక్కడా వినిపించడం లేదు. ఇది కేవలం మౌనం కాదు, మారుతున్న సినిమా మార్కెట్ను రెండేళ్ల క్రితమే పసిగట్టిన వారి 'ముందుచూపు' అని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ సినిమాలు మానేసిన దిగ్గజాలు
గత కొన్నేళ్లుగా గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ నుండి గతంలో లాగా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు రావడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. పెరిగిపోతున్న హీరోల రెమ్యునరేషన్లు, రోజుకు కోట్లలో ఉండే సెట్ ఖర్చులు, తగ్గుతున్న ఓటీటీ రేట్లు సినిమా నిర్మాణాన్ని ఒక రిస్కీ బిజినెస్గా మార్చేశాయి. అందుకే ఈ దిగ్గజాలు తమ ఫోకస్ను కెమెరా ముందు నుండి కెమెరా వెనుక ఉన్న పక్కా బిజినెస్లోకి మార్చేశారు. కొత్త నిర్మాతలు థియేట్రికల్ షేర్ కోసం, పర్సంటేజీల కోసం రోడ్డు ఎక్కి గొడవ పడుతుంటే.. అరవింద్, సురేష్ బాబులు మాత్రం డిజిటల్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ద్వారా ఇండస్ట్రీ పునాదులను తమ ఆధీనంలో ఉంచుకున్నారు.

అల్లు అరవింద్ డిజిటల్ సామ్రాజ్యం
అల్లు అరవింద్ 'ఆహా' ద్వారా సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తమ ప్లాట్ఫామ్కు కంటెంట్ ఉంటే చాలు అనే స్థాయికి చేరుకున్నారు. సురేష్ బాబు ఏషియన్ మల్టీప్లెక్స్లు, థియేటర్ చైన్ల ద్వారా ఎగ్జిబిషన్ రంగంలో తిరుగులేని పట్టు సాధించారు. సినిమా ఆడే థియేటర్ మనదైతే, సినిమా స్ట్రీమ్ అయ్యే ప్లాట్ఫామ్ మనదైతే.. ప్రతి సినిమా మీద వచ్చే కమీషన్ మనదే అయినప్పుడు, ఇక పర్సంటేజీల కోసం రచ్చలోకి దిగాల్సిన అవసరం వారికి లేదు. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక వర్గానికి మద్దతు ఇస్తే, మరో వర్గానికి దూరమవ్వాల్సి వస్తుంది. దశాబ్దాలుగా సంపాదించుకున్న బ్రాండ్ వాల్యూని, లెగసీని ఇటువంటి వివాదాల వల్ల ఒక్క స్టేట్మెంట్తో పోగొట్టుకోవడానికి వీరు సిద్ధంగా లేరు. అందుకే అందరినీ సమానంగా చూస్తూ, తెర వెనుక చక్రం తిప్పడమే వీరికి అలవాటు.
వివాదాన్ని ఎప్పుడు సెటిల్ చేస్తారో?
ప్రస్తుతం మాటల తూటాలు పేలుతున్నా, చివరకు సమస్య సద్దుమణగాలంటే మళ్ళీ ఇలాంటి దిగ్గజాలే మధ్యవర్తిత్వం వహించాలి. ఇప్పుడు సైలెంట్గా ఉండి పరిస్థితిని గమనిస్తున్న వీరు, రచ్చ పీక్స్కు వెళ్ళినప్పుడు 'ట్రబుల్ షూటర్స్' లాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ వివాదానికి దూరంగా ఉండి తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడమే వీరి అసలు ప్లాన్. యుద్ధం చేసేది సైనికులు మాత్రమే, రాజులు ఎప్పుడూ వ్యూహాలు రచిస్తారు. టాలీవుడ్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ పర్సంటేజీ వార్లో అల్లు అరవింద్, సురేష్ బాబు ఈ వివాదాన్ని వారు ఎప్పుడు సెటిల్ చేస్తారో వేచి చూడాలి!












Click it and Unblock the Notifications