ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ఓటమికి అంఫైర్ల తప్పిదమే కారణమన్న వాదనలపై మీ కామెంట్ ఏంటి?
ఐపీఎల్-2019 చెన్నై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్ చేజేతులా జారిపోయిందని ఆవేదన చెందుతున్నారు. లీగ్ దశలో, క్వాలిఫయర్లో చెన్నైను చిత్తుచేసిన ముంబై ఇండియన్స్ ఫైనల్లోను ఒక్క పరుగు తేడాతో కప్ ఎగరేసుకుపోయింది. హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగింది. బూమ్రా, రాహుల్ చాహర్లు అద్భుత బౌలింగ్కు తోడు, చివరి ఓవర్లో మలింగ మ్యాజిక్.. వాట్సన్ పోరాటం వృథాగా మిగిలేలా చేసింది.2013, 2015, 2017లో ట్రోఫీ సొంతం చేసుకున్న ముంబై 2019లోనూ నాలుగోసారి దక్కించుకుంది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న రోహిత్ శర్మ.. ఐదుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 149 పరుగులు చేసింది. చెన్నై ముందు 150 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉందని, ఇది చాలా సులభమని అభిమానులు సహా చాలామంది భావించారు. దానికి తోడు తొలుత చెన్నై దూకుడుకు ముంబై అడ్డుకట్ట వేయలేకపోయింది. దీంతో చెన్నై సునాయాసంగా గెలిచి తీరుతుందనుకున్నారు. కానీ మిడిల్ ఓవర్లలో ముంబై రెచ్చిపోయింది. ముంబై పుంజుకోవడంతో మ్యాచ్ చివరి బంతి వరకు సాగింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉన్నాయి. వాట్సన్ క్రీజులో ఉన్నాడు. దీంతో చెన్నై గెలుస్తుందని భావించారు.
కానీ మలింగ మేజిక్ చేశాడు. అంతకుముందు, మూడు ఓవర్లలోనే భారీగా పరుగులు సమర్పించుకున్న లసిత్ మలింగ చివరి ఓవర్లో మాత్రం ఆకట్టుకున్నాడు. వాట్సన్ను అవుట్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో వికెట్ తీశాడు. దీనికి తోడు అంపైర్ల తప్పిదాలు ఇరుజట్లను దెబ్బతీశాయి. వైడ్లను రైట్ బాల్స్గా పరిగణించడం (ముంబై బ్యాటింగ్), ధోనీ అవుట్ కాకపోయినా అవుట్ ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. అంపైర్ తప్పిదంపై ఆగ్రహంతో పొలార్డ్ బ్యాట్ పైకి విసిరి, వైడ్ బాల్ పడిన చోటుకు వచ్చి నిరసన తెలపాడు. అంపైర్ల తప్పిదాలు ముంబై, చెన్నైలను నష్టపరిచాయని చెబుతున్నారు.
ముఖ్యంగా హార్దిక్ వేసిన 13వ ఓవర్ ఉత్కంఠకు దారి తీసింది. నాలుగో బంతికి వాట్సాన్ సింగిల్ తీశాడు.మిడ్ వికెట్లో ఉన్న బౌలర్ నాన్ స్ట్రైకర్ వైపు వికెట్లకు బంతిని త్రో వేశాడు. హార్దిక్ బంతిని అందుకోలేదు. ఓవర్ త్రో వెళ్లగానే ధోనీ రెండో పరుగు స్టార్ట్ చేశాడు. డీప్ కవర్స్ నుంచి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లను త్రో విసిరాడు. తొలుత ఔట్గా భావించిన ధోనీ, వెళ్లబోగా, అంపైర్లు ఆపారు. థర్డ్ అంపైర్ చాలాసేపు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరికి ధోని ఔటయినట్లు ప్రకటించారు. అంపైరింగ్పై విమర్శలు వస్తున్నాయి. చెన్నై ఓటమికి అంపైర్ల తప్పిదమే కారణమన్న అభిమానుల ఆందోళనతో మీరు ఏకీభవిస్తున్నారా?