ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టొద్దన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబుకు ఏ రిటర్న్ గిఫ్టైనా ఇవ్వండి. కానీ ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టొద్దని సీఎం కేసీఆర్ను కోరిన పవన్... వైసీపీ అధినేత జగన్ను సమర్థించడం సరికాదని అన్నారు. పట్టుమని పది మందిలేని మీరేం సాధిస్తారని గతంలో వైఎస్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఏపీ రాజకీయాల విషయంలో కేసీఆర్ తటస్థంగా ఉండాలని పవన్ కల్యాణ్ సూచించారు. చంద్రబాబుతో ఉన్న గొడవల కారణంగా ఆంధ్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలని చూడటం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయన మీదున్న ఓటుకు నోటు కేసును తిరగదోడండి తప్ప అనవసరంగా ఏపీ ప్రజల మీద జగన్ను రుద్దడానికి ప్రయత్నించకండన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.