NEET UG 2026 counselling: రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి కాలేజీ జాయినింగ్ వరకు పూర్తి వివరాలు!
దేశవ్యాప్తంగా మెడిసిన్ చదవాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) ఫలితాలు జులై 16న అధికారికంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల ప్రకటన ముగియడంతో, తదుపరి కీలక ఘట్టమైన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) వేగంగా అడుగులు వేస్తోంది.
కౌన్సిలింగ్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఎంసీసీ త్వరలోనే తమ అధికారిక వెబ్సైట్ mcc.nic.in లో అందుబాటులో ఉంచనుంది. గతేడాది జులై 21న కౌన్సిలింగ్ మొదటి విడత ప్రారంభమైన నేపథ్యంలో, ఈసారి కూడా అదే సమయానికి ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా, అడ్మిషన్ల క్యాలెండర్ సక్రమంగా సాగాలనే ఉద్దేశంతోనే ఫలితాలను సకాలంలో విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో కలిపి మొత్తం 5,440 కేంద్రాల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11.21 లక్షల మంది విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, ఇతర అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.

ఈసారి ఫలితాల్లో మరో విశేషం ఏమిటంటే, క్వాలిఫై అయిన వారిలో 58 శాతానికి పైగా విద్యార్థినులే కావడం విశేషం. అలాగే అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారిలో ఎక్కువ మంది 17 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న వారే ఉన్నారు. కాగా, పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సాల్ 720 మార్కులకు గానూ 715 మార్కులు సాధించి సంయుక్తంగా టాపర్స్గా నిలిచారు.
4 విడతల్లో సీట్ల భర్తీ.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా..
త్వరలో విడుదల కాబోయే షెడ్యూల్లో ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల పరిధిలోని సీట్ల భర్తీకి సంబంధించిన కీలక తేదీలను పొందుపరుస్తారు. గత ఏళ్ల ట్రెండ్ ప్రకారం.. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను మొత్తం నాలుగు విడతలుగా (రౌండ్-1, రౌండ్-2, రౌండ్-3 మోప్-అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్) నిర్వహించనున్నారు. కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి, తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకుని (వెబ్ ఆప్షన్స్) లాక్ చేయాల్సి ఉంటుంది.
ర్యాంకు ఆధారంగానే సీట్లు..
అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుంది. అభ్యర్థి సాధించిన నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నిబంధనలు మరియు కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, అడ్మిషన్ ఫీజు చెల్లించి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ను ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.














Click it and Unblock the Notifications