తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీ ఖరారు: ఏ పరీక్ష ఏ రోజంటే.?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. వీటిలో 11వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది. ఇటీవల వెల్లడించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు.
హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మల్టీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం..
జూన్ 5న జనరల్ ఇంగ్లిష్ (అర్హత పరీక్ష)
జూన్ 6న జనరల్ ఎస్సే (పేపర్-1)
జూన్ 7న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్-2)
జూన్ 8న ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ (పేపర్-3), జూన్ 9న ఎకానమీ అండ్ డెవలప్మెట్ (పేపర్-4)
జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ (పేపర్-5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావం (పేపర్-6) అంశాలపై పరీక్షలు జరగనున్నాయి.
ఇది ఇలావుండగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖలో ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications