అల్లు అర్జున్పై మరోసారి పవన్ కల్యాణ్ కామెంట్స్
మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ సమావేశంలో అటవీశాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమాల్లో హీరోలు ఎర్ర చందనం స్మగ్లర్లుగా నటించడమేంటని, సమాజానికి ఎటువంటి సంకేతాలు వెళతాయంటూ ప్రశ్నించారు. కచ్చితంగా బన్నీని ఉద్దేశించే మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున అక్కడినుంచి పోటీచేస్తున్న తన మిత్రుడు కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడంతో మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి.
ఉప ముఖ్యమంత్రి హోదాలో స్పందించిన పవన్
పవన్ గెలిచిన తర్వాత కూడా ట్వీట్ తో బన్నీ సరిపెట్టాడు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో తెలుగు స్టార్ కథానాయకులంతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కోటిరూపాయలు, చిరంజీవి కోటిరూపాయలు, బాలయ్య కోటిరూపాయలు, అల్లు అర్జున్, రామ్ చరణ్ కోటిరూపాయలు, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రానా, ఇలా అందరు హీరోలు తమకు తోచినంతలో విరాళాలు ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ స్పందించారు.

ఎంతోమందికి భరోసా కల్పిస్తుంది
జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు గొప్ప మనసుతో క్లిష్టమైన సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు. అందుకు వారికి ప్రత్యేకగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ.. ఇలా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడ్డారని, అందుకు మీరు చూపించిన ఔదార్యాన్ని వెలకట్టలేమన్నారు. ఈ సహాయం ఎంతోమందికి స్ఫర్తిగా నిలిచి మరింతమంది విరాళాలివ్వడానికి ముందుకు వస్తారని, ఇది ఎంతోమంది నిరాశ్రయులకు భరోసా కల్పిస్తుందని పవన్ కల్యాణ్ ట్విటర్ లో రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications