గచ్చిబౌలిలో జూనియర్ ఎన్టీఆర్ లగ్జరీ మల్టీప్లెక్స్
హైదరాబాద్ ఐటీ కారిడార్లో లగ్జరీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు కేవలం సినిమాల్లో నటనకే పరిమితం కాకుండా, ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తున్న క్రమంలో తారక్ కూడా ఇదే బాట పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
మల్టీప్లెక్స్ ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన మహేష్ బాబు
తెలుగు చిత్రసీమలో ఈ రకమైన మల్టీప్లెక్స్ బిజినెస్ ట్రెండ్కు సూపర్ స్టార్ మహేశ్ బాబు శ్రీకారం చుట్టారు. ఏసియన్ సినిమాస్తో కలిసి ఆయన గచ్చిబౌలిలో నిర్మించిన 'ఏఎంబీ సినిమాస్' విలాసవంతమైన వీక్షణ అనుభూతిని అందిస్తూ దేశంలోనే అత్యంత విజయవంతమైన మల్టీప్లెక్స్గా నిలిచింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదే ఏసియన్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుని అమీర్పేట్లో 'ఏఏఏ సినిమాస్' ప్రారంభించగా, మాస్ మహారాజా రవితేజ దిల్ సుఖ్నగర్ వద్ద 'ఏఆర్టీ సినిమాస్' నిర్మించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం మహబూబ్నగర్లో 'ఏవిడి సినిమాస్' పేరుతో లగ్జరీ స్క్రీన్ను అందుబాటులోకి తెచ్చారు. యంగ్ హీరో నాని కూడా ప్రస్తుతం ఇదే బాటలో పయనించబోతున్నారు. త్వరలో ఆయన కూడా మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నారు.

ప్రీమియం మల్టీప్లెక్స్ తో తారక్ రంగప్రవేశం
ఇప్పుడు ఈ స్టార్ ఎగ్జిబిటర్ల సరసన చేరేందుకు జూనియర్ ఎన్టీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా నానక్రామ్గూడ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రీమియం మల్టీప్లెక్స్ను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగులు, ఉన్నత వర్గాల జనాభా ఎక్కువగా ఉండే ఈ ఐటీ కారిడార్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన థియేటర్కు విపరీతమైన డిమాండ్ ఉంది.ఈ ప్రచారం నిజమైతే, సొంత బ్రాండ్ నేమ్తో మల్టీప్లెక్స్ రంగానికి ప్రాతినిధ్యం వహించే మరో బడా టాలీవుడ్ స్టార్గా ఎన్టీఆర్ నిలుస్తారు. ప్రస్తుతం ఇదంతా పరిశ్రమలో సాగుతున్న జోరుగా చర్చ మాత్రమే కాగా, తారక్ లేదా ఆయన బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈ బిజినెస్ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత రానుంది.














Click it and Unblock the Notifications