అతన్ని కలవడం కోసం ప్రత్యేక విమానంలో వెళ్లిన చిరంజీవి, నాగార్జున
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నరు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. సినిమాలపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉంటారు. కలిసి వ్యాపారాలు చేస్తారని వార్తలు వస్తాయికానీ వాటిల్లో నిజమెంతో తెలియదు. అన్ని సందర్భాల్లోను ఇద్దరూ ఒకర్నొకరు తోడుగా ఉంటారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తీవ్రస్థాయిలో ఖండించడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అటువంటి కథానాయకులిద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు.
కల్యాణరామన్ ఇంటికి వెళ్లారు
కేరళలోని త్రిసూరు లో కల్యాణ్ జ్యువెలర్స్ యజమాని టీఎస్ కల్యాణరామన్ ఇల్లు ఉంది. దసరా వేడుకలు వారి ఇంట్లో వైభవంగా నిర్వహిస్తారు. తాము వేడుకలు బాగా చేస్తామని, మీరిద్దరూ ఒకసారి ఇందులో పాల్గొనాలంటూ కల్యాణరామన్ చిరంజీవికి, నాగార్జునకు ఆహ్వానం పంపారు. కల్యాణ్ జువెలర్స్ కు నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగార్జునకు కూడా వాటాలున్నాయని అంటారుకానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ లేదు. వచ్చిన ఆహ్వానం మేరకు దసరా వేడుకల్లో పాల్గొనేందుకు ఇద్దరు స్టార్ హీరోలు ప్రత్యేక విమానంలో త్రిసూరు వెళ్లారు. కల్యాణ్ రామన్ ఇంట్లో వేడుకల్లో పాల్గొనడంతోపాటు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.

వందో సినిమాపై ప్రకటన ఎప్పుడో?
సినిమాల విషయానికొస్తే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం టీజర్ విడుదలైంది. 30 మిలియన్లకు పైగా వీక్షణలతో దూసుకుపోతోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున కూలీ, కుబేర చిత్రాల్లో నటిస్తూనే తన 100వ సినిమా గ్రాండ్ గా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కథలను వింటున్నారు. రకరకాల కథలు వింటున్నప్పటికీ నాగార్జున తృప్తి చెందడంలేదు. తన వందో సినిమాలపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు.












Click it and Unblock the Notifications