'ఇక్కడ మంత్రి, సీఎం అన్నీ నేనే'.. డైలాగ్ కింగ్ మరో పవర్ఫుల్ రోల్!
డైలాగ్ కింగ్ సాయి కుమార్ కేవలం పోలీస్ ఆఫీసర్ పాత్రలకే కాకుండా, పొలిటికల్ లీడర్ పాత్రలకు కూడా ఓ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. 'ప్రస్థానం' సినిమాలో ఆయన పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర, చెప్పిన డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ తర్వాత 'మయసభ' వెబ్ సిరీస్ లోనూ సీనియర్ ఎన్టీఆర్ పాత్రను గుర్తుచేసే రాయపాటి చక్రధర్ రావుగా ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరోసారి ఆయన రాజకీయ నాయకుడి పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం 'ధర్మస్థల నియోజకవర్గం'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ అత్యంత ఆసక్తికరమైన అంశంతో మొదలువుతుంది. దేశంలో అంతర్యుద్ధాలను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులు రాకుండా చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం వెనుక డీప్ స్టేట్ పవర్ ఉందంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో పాటు ప్రజల ఆందోళనలను చూపించారు. ఆ తర్వాత 'ధర్మస్థల నియోజకవర్గపు సామంత రాజు(ఎమ్మెల్యే)'అని ఉన్న కార్ బోర్డుపై సాయి కుమార్ ను భైరాజ్ అనే క్యారెక్టర్లో ఎంట్రీ ఇప్పిస్తారు. "ఇక్కడ మంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యాంగం.. అన్నీ నేనే" అంటూ సాయి కుమార్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్.. ఆయన ఆ నియోజకవర్గంలో ఓ నియంతలా ఏలుబడి సాగిస్తున్నారని స్పష్టం చేస్తుంది.

ఈ స్టోరీలో రాజకీయ పోటీ, వ్యూహాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రాష్ట్రం మొత్తం తమ పార్టీ జెండా ఎగిరినా, ధర్మస్థల నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోతున్నామని ప్రత్యర్థి పార్టీ నేత(పృథ్వీ) చెప్పడం కథలోని తీవ్రతను చూపిస్తుంది. అలాంటప్పుడు ఆ భైరాజ్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు ఏం చేశారు? ఆయన నియంతృత్వ పాలనను ఓ సామాన్యుడిగా సుమన్ ఎలా ఎదిరించాడు? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.
ట్రైలర్లో సాయికుమార్, సుమన్ చెప్పే డైలాగ్స్ పొలిటికల్ డ్రామా స్థాయిని అమాంతం పెంచేశాయి. "మనీ తప్ప మానవత్వంతో సంబంధం లేని మృగాల మధ్య బతుకుతున్నాం అని సుమన్ ఆవేదన వ్యక్తం చేయగా.. "రాజకీయం అనేది మృగాలు ఉండే అడవి లాంటిది.. వాటి జోలికి వెళ్లకుండా తప్పించుకుని తిరిగితే ప్రశాంతంగా బతకొచ్చు" అని సాయి కుమార్ చెప్పే సీరియస్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించిన ఈ సినిమాను మేరు భాస్కర్ నిర్మించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ఎంతో వైభవంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ: "'రంగస్థలం' తర్వాత పాటల పరంగా నాకు అంతటి సంతృప్తిని, సంతోషాన్ని అందించిన సినిమా ఇది. విభిన్న సందర్భాలకు తగ్గట్టు ఐదు అద్భుతమైన పాటలు రాశాను. 'ఆరంభం', 'న్యాయం చేయరా దేవుడా', 'ధర్మో రక్షతి రక్షిత:' వంటి పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటాయి. 'ప్రతిఘటన'లో విజయశాంతి తరహాలోనే వితికా షేరుకు ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ లభించింది" అని అన్నారు.
హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ: "పాటలు, కథ ఎంతగానో నచ్చడంతోనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత లభించిన ఒక డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ రోల్ ఇది. జై జ్ఞాన ప్రభ మొదటి సినిమా అయినా ఎంతో బ్రిలియంట్గా తెరకెక్కించారు. సెప్టెంబర్ 4న విడుదలవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.













Click it and Unblock the Notifications