చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సమంత
సంథింగ్ స్పెషల్.. మీకు ఒక ప్రత్యేక వార్త చెప్పబోతున్నానంటూ స్టార్ హీరోయిన్ సమంత ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది ఏమై ఉంటుందా? అంటూ రకరకాలుగా చర్చ సాగింది. కొత్త సినిమా ఏమైనా ఒప్పుకుందా? అని లేదంటే సిటాడెల్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తను ధ్రువీకరిస్తుందా? అంటూ ఊహాగానాలు సాగాయి. వీటన్నింటికీ సమంత తెరదించింది. దేశంలోని మహిళల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు, వారి క్రీడాభివృద్ధికి తోడ్పడతానని ప్రకటించారు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో (WPBL) చెన్నై జట్టుకు యజమానిగా మారినట్లు తన ఇన్ స్టా ఖాతాలో తెలియజేశారు.
తాను ఈ ఆటను చూడగానే ప్రేమలో పడిపోయానని, చెన్నై ఫ్రాంఛైజీకి యజమానిగా మారడం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపిస్తోందన్నారు. మనదేశంలో ఈ ఆట రోజురోజుకు ప్రాచుర్యం పొందుతోందని, పికెల్ బాల్ ఆట అభివృద్ధిలో తాను భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. స్త్రీలు మరింతమంది ఈ ఆటవైపు మొగ్గుచూపేలా చేయడమే తన లక్ష్యమని వివరించారు. దేశంలో మహిళల అభివృద్ధి కోసం తన చేతనైనంతలో కృషిచేస్తుంటానని, వారికి ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యం కల్పిస్తానన్నారు.

పికెల్ బాల్ ఆటకు అమెరికాలో మంచి క్రేజ్ ఉంది. 1965లో ఈ ఆటను అక్కడ ప్రవేశపెట్టారు. ఓ కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరు పికెల్. ఆ కుక్క కోసం వారు తీసుకొచ్చిన ఆటే పికెల్ బాల్. అప్పటినుంచి క్రమేణా అమెరికా మొత్తం వ్యాపించి విపరీతమైన ఆదరణ పొందింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు మంచి ఆదరణ దక్కుతోంది.
ఈ ఆటలో వాడే బ్యాట్ టేబుల్ టెన్నిస్ ఆటలో ఉండేదానికంటే కొంచెం పెద్దగా ఉండి చతురస్రాకారంలో ఉంటుంది. టెన్నిస్ లానే ఉన్నప్పటికీ నెట్ ఎత్తు తక్కువగా ఉంటుంది. వాడే బంతి కూడా రంధ్రాలుండి తక్కువ బరువుతో ఉంటుంది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై జట్టును సమంత ఎంతకు కొనుగోలు చేశారు అనే విషయం పూర్తిగా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications