తెలంగాణ ఎత్తుగడలు
ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాగం ఎత్తుకున్నాయి. తెలంగాణ కోసం తామే ముందున్నామని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. అయితే ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును వ్యతిరేకిస్తున్నాయి. తన ప్రజా ప్రతినిధుల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఆహ్వానించినందుకు కెసిఆర్ ను తప్పు పడుతున్నాయి. ఈ ఎన్నికలు వృధా అని, స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రశేఖరరావు ఎన్నికలను ఆహ్వానించారని విమర్శిస్తున్నాయి.
కరుడు గట్టిన సమైక్యవాది అయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంటును గుర్తిస్తున్నామని ప్రకటించారు. తాము పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణవాదం ఢిల్లీలో వినబడుతుందని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం రాదని, తమ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. తాము వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. తెలంగాణ పేరుతో కాంగ్రెస్, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శిస్తున్నారు.
ఇకపోతే, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాగం అందుకున్నారు. తెలంగాణ పట్ల కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన అంటున్నారు. తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధిష్ఠానవర్గం తీవ్రంగా పరిశీలిస్తోందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వస్తుందని, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారనే నమ్మకం తమకు ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అంటున్నారు. తమ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బిజెపి నాయకులు అంటున్నారు. అందరూ శాకాహారులే కోడి మాయమైందన్నట్లు తెలంగాణ పరిస్థితి ఉంది. అందరూ తెలంగాణకు అనుకూలమే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగుళం కూడా ముందుకు కదలరు. మాటల్లో మాత్రం తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనని ప్రకటిస్తారు.
రాజకీయ పార్టీలన్నీ తెలంగాణపై ఎనలేని ప్రేమ కురిపించడానికి ఉప ఎన్నికలు తప్ప మరోటి కారణం కాదు. ఉప ఎన్నికలే రాకుండా ఉంటే ఈ పార్టీలు తెలంగాణ గురించి ఇంత ముందుకు వచ్చి మాట్లాడి ఉండేవి కావు. ఉప ఎన్నికల విషయంలో జయాపజయాలను పక్కన పెడితే పార్టీలన్నీ తెలంగాణ రాగం ఎత్తకునేలా చేయడం ద్వారా తెరాస సగం విజయం సాధించినట్లే. ఉప ఎన్నికల్లోనూ తెరాస మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందనే విశ్లేషణలు వెలుడుతున్నాయి. అన్ని పార్టీల ధ్యేయం మాత్రం ఒక్కటిగానే కనిపిస్తున్నది. ఏదో రకంగా తెరాస అభ్యర్థులను ఓడించడం ఆ పార్టీల లక్ష్యం. వీలుంటే అన్ని పార్టీలు కలిసి తెరాసకు వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పోటీకి పెట్టి ఉండేవి. అయితే, ప్రజలు దాన్ని తిప్పికొడతారనే ఉద్దేశంతోనే అందుకు పూనుకోలేదని అనుకోవాలి.
అన్ని పార్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడదు. కాంగ్రెసు పార్టీది ఈ విషయంలో పెద్ద మోసం. ఎన్నికల్లో గులాబీ కండువాలు వేసుకుని తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెసు ఆ తర్వాత మోసం చేయడానికే పూనుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆరే అడ్డుగా ఉన్నారని ముఖ్యమంత్రి ఒకానొక సందర్భంలో అన్నారు. తెలంగాణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సోనియా గాంధీ చేత ప్రకటింపజేస్తే కెసిఆర్ కాంగ్రెస్ రాజకీయాల ప్రాబల్యానికి అడ్డుగా నిలబడరనే విషయం ఆయనకు తెలిసినట్లు లేదు. రాజకీయ పార్టీల తెలంగాణ ఎత్తుగడలు ప్రజలు బాగానే అర్థం చేసుకుంటారు.












Click it and Unblock the Notifications