తెలంగాణ: ఓ ప్రజాస్వామ్య ఆకాంక్ష
1. తెలుగు ఏకత: తెలంగాణలో తెలుగు మాత్రమే లేదు. తెలంగాణ కాస్మోపాలిటన్ ప్రాంతం. ఉర్దు మాట్లాడే ప్రజలు గణనీయంగా ఉన్నారు. పార్శీలు, మరాఠీలు ఉన్నారు. భాష, ప్రాంత, కులం ప్రాతిపదికలపై కూడా మానవత్వ దిశగా ప్రపంచం సాగుతోంది. భాషా ప్రాతిపదికపై కాకుండా కాస్మోపాలిటన్ భాషా భావనతో కులీ కుతుబ్షా హైదరాబాద్ను నిర్మించాడు. తెలుగు ఏకత గురించి మాట్లాడితే కేవలం ప్రాంతీయ భావనతో మాట్లాడుతున్నారనేది నా ఉద్దేశం.
తెలుగుకు సమానంగా ఉర్దూను, హిందీని, మరాఠీని చూడాల్సి ఉంటుంది. తెలుగు ఏకత గురించి మాట్లాడుతున్నవారే దురదృష్ణవశాత్తు దశాబ్దాలుగా తెలంగాణ భాషను, సంస్కృతిని అవమానించారు. ఎ. సచివాలయంలో పది శాతం కన్నా తక్కువ మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. బి. తెలుగు సినిమాలు తెలంగాణ భాషను అవమానిస్తున్నాయి. దీంతో మేం మా సొంత గడ్డ మీదనే అస్తిత్వం కోల్పోయాం. ఐదు శాతం కన్నా తక్కువ మంది తెలంగాణ నటులు ఉన్నారు. సినీ రంగం ప్రతిభకు పీఠం వేస్తుందని అంటారు. ప్రతిభను నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు కల్పించలేదనేది మా వాదన. సి. 610 జీవోను గానీ ముల్కీ నిబంధనలను గానీ అమలు చేయలేదు. డి. ఇరు ప్రాంతాలను విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు సహోదరం మాట ఏమైందనేది ప్రశ్న.
భారతదేశంలో బహు భాషలున్నాయి. విభిన్న సంస్కృతులతో, విభిన్న భాషలతో, మతాలతో భారతదేశం విలసిల్లుతోంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ప్రజాస్వామ్యం మన దేశంలో ఉంది. తెలుగు భాషా ప్రాతిపదికపై ఈ స్థితిలో ఒకే రాష్ట్రంగా ఉండాలనేది ప్రాంతీయ భావనే అవుతుంది. ప్రాంతీయ భాషల కన్నా జాతీయ భాషపై మనం అభిమానం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2. పొట్టి శ్రీరాములు: తెలంగాణ (హైదరాబాద్)కు పొట్టి శ్రీరాములుకు ప్రత్యక్ష సంబంధం ఏదీ లేదు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవాలని ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన గొప్ప నేత పొట్టి శ్రీరాములు. తన లక్ష్యాన్ని సాధించడానికి ఆయన ప్రాణాలర్పించాడు.
పొట్టి శ్రీరాములు త్యాగంతో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంతో హైదరాబాద్ రాష్ట్రం విడిగా ఉంది. తెలంగాణ ప్రాంతాన్ని 1956లో విలీనం చేసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వాస్తవాల నేపథ్యంలో నాలో ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎ. చరిత్రను, వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 అక్టోబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములును స్మరించుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములను గుర్తు చేసుకుంటున్నారనేది ప్రశ్న. బి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ వచ్చిన ప్రతిసారీ పొట్టి శ్రీరాములు చిత్రాలను రాజకీయ నాయకులు ఎందుకు వాడుతున్నారనేది మరో ప్రశ్న.
3. కలిసి ఉంటే బలంగా ఉంటాం, విడిపోతే బలహీన పడుతాం: ఈ వాదనలో పస లేదు. మద్రాసుతో విడిపోయినప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులు ఆ నినాదం ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్న. 1950 తలెత్తిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కూడా ప్రజాస్వామికమైన డిమాండే. అస్తిత్వ, తెలుగు ప్రజలకు నష్టం, స్వయంపాలన, అవకాశాలు వంటి అంశాలపై ఆధారపడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేందుకు ఆ ఉద్యమం జరిగింది.
పై అంశాలను చూస్తే రెండు ప్రాంతాల సహోదరత్వ స్ఫూర్తి లేదనేది అర్థమవుతోంది. రాజకీయంగా ఇరు ప్రాంతాలు విడిపోయినప్పుడు సహోదరత్వ భావన పెరుగుతుంది. రాజకీయంగా విభిన్నత, భావోద్వేగ సమైక్యత అనే దాని మీద సహోదర భావన విస్తరిల్లుతుంది.
విభజన వల్ల రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సరైన నిధుల కేటాయింపుల ద్వారా ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడవచ్చు. అరవై ఏళ్లుగా హైదరాబాద్ ఇరు ప్రాంతాలకు రాజధానిగా ఉన్న మాట నిజమే. అందువల్ల విడిపోతే రాజధానిని కోల్పోయే ప్రాంతానికి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.
విభజన వల్ల ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు అభివృద్ధి చెంది, దక్షిణ భారతదేశంలో మంచి నగరాలు ఏర్పడుతాయి. రాజధాని ఏర్పడడం వల్ల ఉద్యోగవకాశాలు పెరుగుతాయి. రాజధానికి పరిశ్రమలు వస్తాయి, వైద్య సౌకర్యాలు రాజధానిలో పెరుగుతాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఆంధ్ర ప్రజలు, భారత ఉపఖండం ప్రజలు గుర్తిస్తారనే ఆశ ఉంది. ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే కొత్త రాష్ట్రంలో హైదరాబాద్, బెంగళూర్ వంటి మరో మంచి నగరం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.
నాగేందర్ చిందం, యునైటెడ్ కింగ్డమ్