పీకల్లోతు కష్టాల్లో పిసిబి
వచ్చే నెలలో పాకిస్థాన్ లో జరగాల్సిన భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దయింది. ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తినందున భారత జట్టు పర్యటన రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాక్ పర్యటనను రద్దు చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇంతకాలం అనుకుంటున్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉంది. ఈ పర్యటన రద్దు వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి 20 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల టెలివిజన్ హక్కుల కోసం పిసిబి చేసుకున్న ఒప్పందంపై కూడా దీని ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని పిసిబి అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి.
జనవరి మొదటివారంలో భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. టెస్టు సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఇరు జట్ల మధ్య తలపెట్టారు. క్రికెటర్లకు పాక్ లో రక్షణ ఉండదనే భయాలే కాకుండా ఇరుదేశాల మధ్య ముంబై దాడుల తర్వాత దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. తమ బోర్డు ఇదివరకే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని, భారత పర్యటన రద్దయితే కోలుకోలేని స్థితికి చేరుకుంటామని పిసిబి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సలీం అల్తాఫ్ ఇదివరకే అన్నారు. టెలివిజన్ చానెల్ కొత్త ఒప్పందం నుంచి తమకు ఏ విధమైన ఆదాయం ఉండదని, ఆదాయ సమీకరణకు ఇతర మార్గాలు కూడా లేవని ఆయన అన్నారు. ఇటీవలే దుబాయ్ కి చెందిన టెన్ స్పోర్ట్స్ తో పిసిబి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది పాకిస్తాన్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. 21 వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి దిగువ స్థాయి జట్లతోనే ఎక్కువగా ఆడింది. భద్రతా కారణాలతో పాక్ లో పర్యటించడానికి అగ్రశ్రేణి జట్లు నిరాకరిస్తున్నాయి.
టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం, స్టేడియం బిల్ బోర్డుల కోసం కొత్త బిడ్లేవీ రావడం లేదని, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు లేకపోవడంతో దీర్ఘకాలిక డీల్స్ పై సంతకాలు చేయడానికి ఎవరూ ముందుకు కావడం లేదని అల్తాఫ్ అన్నారు. 15 ఏళ్ల విరామం తర్వాత 2004లో భారత జట్టు పాక్ లో పర్యటించింది. ఈ సందర్భంగా పిసిబి 20 మిలియన్ డాలర్లు ఆర్జించింది. భారత పర్యటన రద్దయితే శ్రీలంకను ఆహ్వానించడానికి పిసిబి ప్రయత్నిస్తోంది. సంక్షోభంతో పిసిబి స్టాఫ్ ను తగ్గించడం ద్వారా, ఇతర వ్యయాలను తగ్గించడం ద్వారా వ్యయంలో 40 శాతం కోత విధించింది.