క్రికెట్: సీనియర్ల గొడవ
ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్టు మ్యాచ్ మొహాలీలో రేపు (శుక్రవారం) ప్రారంభం కాబోతున్నది. పలు వివాదాలు చెలరేగుతుండగానే తొలి టెస్టును భారత్ డ్రా చేసుకోగలిగింది. అయితే తొలి మ్యాచులో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. తొలి టెస్టులో గాయపడిన భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే రెండో టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది. కానీ తమకు కుంబ్లేపై తమకు నమ్మకం ఉందని కోచ్ గ్యారీ కిర్సస్టన్, చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ అంటున్నారు. వారు ఎంత నమ్మకాన్ని ప్రకటిస్తున్నప్పటికీ భారత జట్టులో సీనియర్లు అంత కుదురుగా, స్థిర చిత్తంతో లేరనేది తెలిసిపోతూనే ఉన్నది. సీనియర్లు శారీరక దారుఢ్యంలోనే కాకుండానే నైతికంగా దెబ్బ తిన్నట్లు కనిపిస్తున్నారు. నిజానికి, ఇదంతా వారు కొని తెచ్చుకున్నదే.
ఇరానీ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంతో ఇక క్రికెట్ చరిత్రలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ శకం ముగిసిందనే భావించారు. ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టులకు గంగూలీని ఎంపిక చేసి అవకాశాలు సజీవంగా ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు. గంగూలీని ఎంపిక చేయడాన్ని మాజీ క్రికెటర్ కిరణ్ మోరే తప్పు పట్టారు కూడా. అయితే గంగూలీ అవకాశాలను సజీవంగా ఉంచడానికి బదులు తుంచేయడానికే ఆ ఎంపిక జరిగిందనే వార్త వెంటనే గుప్పుమంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ముగియగానే క్రికెట్ క్రీడ నుంచి తప్పుకుంటానని గంగూలీ హామీ ఇచ్చాడని, దానివల్లనే ఆయనకు చివరి అవకాశం ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను మొదట గంగూలీ ఖండించినా ఆ తర్వాత ఈ సిరీస్ తర్వాత తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాంతో బిసిసిఐ పెట్టిన షరతు నిజమే కావచ్చునని అనిపించింది. ఇదే సమయంలో కుంబ్లే కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కుంబ్లే ఖండించాడు.
భారత క్రికెట్ కు ఐదుగురు సీనియర్లు భారమయ్యారనే భావన నెలకొని ఉంది. వీరు గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే. నిజానికి ఈ సీనియర్లు అంతర్జాతీయ క్రికెట్ లో తమదైన ముద్ర వేసినవారే. వారి ప్రతిభను ఇతోధికంగా ప్రదర్శించి భారత క్రికెట్ ను అగ్రభాగాన నిలిపినవారే. కానీ క్రమక్రమంగా వారు తమ కాంతిని కోల్పోతూ వచ్చారు. ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మన్ అయిన సచిన్ టెండూల్కర్ 77 పరుగులు చేసి బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ప్రత్యర్థి బౌలర్లను దడదడలాడించిన టెండూల్కర్ నిజానికి శ్రీలంక పర్యటనలోనే రికార్డును సృష్టిస్తాడని అనుకున్నారు. కానీ శ్రీలంక సిరీస్ లో అతను పేలవమైన ఆటను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ ఆ పరుగులు చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్సులో విఫలమైన ఆయన రెండో ఇన్నింగ్సులో మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా 49 పరుగులు చేశాడు. ఇంకా 15 పరుగులు చేస్తే బ్రియాన్ లారా రికార్డును సచిన్ అధిగమిస్తాడు. ఇక, రాహుల్ ద్రావిడ్ గానీ, వివియస్ లక్ష్మణ్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఆస్ట్రేలియాతో మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్ వరుసగా విఫలమవుతున్నాడు. కుంబ్లే సరేసరి, మంచి ఆటగాడిగా పేరు సంపాదించుకున్న ఆయన వివాదాలతో తీవ్రంగా కృంగిపోయినట్లు కనిపిస్తున్నాడు.
సీనియర్లు ఇటీవలి కాలంలో పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. తమకు దక్కిన అవకాశాలను కూడా వాడుకునే స్థితిలో కూడా లేరు. పైగా, రిటైర్ కావడానికి కూడా సిద్ధపడడం లేదు. ఏదో రకంగా వన్డే జట్టుకు సచిన్ ను మినహా మిగతా సీనియర్లను దూరం చేయగలిగారు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో గాయం కారణంగా టెండూల్కర్ ఆడలేదు. అయినా మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్ ను సాధించుకుని వచ్చింది. అంతకు ముందు జరిగిన టెస్టు సిరీస్ ను సీనియర్లతో కూడిన భారత జట్టు కోల్పోయింది. సీనియర్లు తప్పుకుంటే ఆటగాళ్లు లేరనే భయం కూడా లేదు. పలువురు యువ ఆటగాళ్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. యువరాజ్ సింగ్ వంటి మంచి ఆటగాళ్లకు కూడా సీనియర్ల వల్ల టెస్టు జట్టులో స్థానం లభించడం లేదు. అందువల్ల సీనియర్లు తొలిగితే జట్టు ఏమవుతుందోననే భయం లేదు. కేవలం సీనియర్ల మొండి పట్టు వల్లనే పరిస్థితి విషమిస్తోంది. సీనియర్లు తమ సత్తా చాటకపోతే వారిని తప్పించడం తప్ప బిసిసిఐ వద్ద మరో మార్గం ఉండదనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. ఈ స్థితిలో సీనియర్లు గౌరవంగా తమంత తాము తప్పుకుంటేనే మంచిది.












Click it and Unblock the Notifications