విలక్షణ నటుడు కిషోర్ దాస్
మాటీవీలో రాత్రి పూట సరసమైన కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈటీవీలో వంటల ప్రత్యేక కార్యక్రమంలో ఆహాలో నటించి ఓహో అనిపించుకుంటున్నాడు. ఇటీవల ఎన్నికల సందర్భంగా టీవీ9 లో ప్రసారమైన 'ఎవడిగోల వారిది' కార్యక్రమంలో పోషించిన ప్రధాన పాత్ర పెద్ద హైలైట్ అయింది. ఒకరోజు ఆ కార్యక్రమాన్ని ఒక ఆంటీ నిర్వహించింది. ఫ్యామిలీ టైపులో ఉన్న ఆమెను పరిచయం చేసుకోడానికి ప్రేక్షకులు ఫోన్లు చేసి ఎంక్వయిరీలు చేశారట. ఆ ఆంటీ కూడా కిషోర్ దాసే.
ఇన్ని వైవిధ్యమైన వేషాలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్న దాస్ కు ఇప్పుడిప్పుడే సినిమా పాత్రలు వస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని చదువుకుని ఉండడంతో పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని దానికి తగిన హావభావాలు ప్రదర్శిస్తుండం ఇతని ప్రత్యేకత. సినిమా వేడెక్కిన స్ధితిలో చల్లార్చడానికి నవ్వులు పండించడానికి దాస్ వంటి నటులు అవసరమవుతారు. బాపూ గనుక ఇప్పుడు సినిమాలు తీస్తూ ఉంటే దాస్ కోసం ఆయన ఒక ప్రత్యేక పాత్రను సృష్టించేవారు.
పాతికేళ్ళ క్రితం ఈనాడు విశాఖపట్నం ఎడిషన్ లో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన దాస్ ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ఆయనలో ఉన్న నటుడు ఒక చోట ఉండనివ్వలేదు. అనేక మజిలీల తర్వాత ఇప్పుడాయన ఫుల్ టైమ్ నటుడిగా స్ధిరపడాలనుకుంటున్నారు. సమయస్ఫూర్తి, సందర్భోచిత హాస్యం, తెలుగుపదప్రయోగాల్లో నైపుణ్యం ఈయన ప్లస్ పాయింట్లు.