తెలుగు హీరోల మధ్య వైరం
హీరోల వ్యవహారమే అభిమానుల తీరుకు కారణమని చెప్పవచ్చు. తెలుగులో వృత్తిపరమైన పోటీ తక్కువ. ఇతరేతర విషయాలే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్ల మధ్య పోటీ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా వారిద్దరు మంచి మిత్రులు. ఆలాంటి వాతావరణం తెలుగులో లేదు. చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమ రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా పరిణమించింది. ఆ రెండు సామాజిక వర్గాలు పరస్పరం ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. మధ్య మధ్యలో పాత్రలు అటూ ఇటూ మారుతుంటాయి. అందులోనూ వ్యక్తిగతమైన కారణాలే ఎక్కువగా పనిచేస్తాయి.
ఇటు నందమూరి కుటుంబ హీరోలు, అటు చిరంజీవి కుటుంబ హీరోలు తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వారు సూపర్ స్టార్లుగా చెలామణి అవుతుంటారు. ఒకప్పుడు చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య పడేది కాదు. వారిద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య వైరంగా కూడా తెలుగు సినీ రంగాన్ని చూస్తారు. అదే ఇరువురి అభిమానుల మధ్య వైరానికి కారణమవుతోంది. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆధిపత్య పోరు ఎక్కువ కావడంతో అభిమానులు దానికి బలిపశువులుగా మారుతున్నారు. చిరంజీవిపై రాజశేఖర్ తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకు చిరంజీవి అభిమానులు చెలరేగడం ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
మంచి కథ వల్ల మంచి సినిమా వస్తుందని, ప్రేక్షకాదరణ పొందుతుందని మన అగ్రహీరోలకు నమ్మకం లేదు. తాను ఎంత ఎక్కువగా కనిపిస్తాను, తన హీరోయిజం ఎలా పండుతుందనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. పాత్ర కోసమైనా సరే, కాస్తా నెమ్మదించే పాత్రను వారు అంగీకరించరు. ఆరు యుగళగీతాలు, పది ఫైట్లుగా సినిమా సాగిపోవాల్సిందే. విలన్లను, వారి అనుచరులను ఒంటి చేతి మీద నరికిపడేయాల్సిందే. తమ పాత్ర అంత హీరోచితంగా ఉంటేనే అభిమానులకు తమపై అభిమానం ఉంటుందని, అభిమానులే సినిమాను విజయవంతం చేస్తారని వారు నమ్ముతారు. సినిమా బాక్సాఫీసు వద్ద చతికిలపడితే దర్శకుడి మీదనో, మరొకరి మీదనో విరుచుకుపడుతారు. ఈ అవసవ్య విధానమే బాహ్య ప్రపంచంలోనూ వ్యక్తమవుతోంది.