జగన్కు సహకారం: మంత్రులకు కొత్త చిక్కులు!

మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఎస్వి ప్రసాద్, సివిఎస్కె శర్మ, ఆదిత్యనాథ్ దాస్, శ్యాంబాబు, మన్మోహన్ సింగ్, రత్నప్రభ, ఎల్వి సుబ్రమణ్యంలు సహకరించారని తెలిపింది. ఇప్పటికే నోటీసుల దెబ్బకే మంత్రులు తల్లడిల్లుతూ... ఏం చేయాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు.
తాజాగా సిబిఐ కూడా వారికి షాక్ ఇవ్వడం గమనార్హం. ఆరుగురు మంత్రులపై ఆరోపణలు నిజమేనలా సుప్రీం కోర్టుకు చెప్పింది. దీంతో నోటీసు మంత్రులు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోవడం ఖాయంగా అనిపిస్తోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 26 వివాదాస్పద జీవోలు జారీ అయ్యాయని... క్విడ్ ప్రో కోలో అవే కీలకమని సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్ వేశారు. మంత్రులు, ఐఏఎస్ల పైనా విచారణ జరపాల్సిందిగా ఆదేశించాలని కోరారు.
ఇందులో మంత్రులు, ఐఏఎస్లతోపాటు సిబిఐని కూడా ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీం కోర్టు సిబిఐతో సహా అందరికీ ఈ ఏడాది మార్చిలో నోటీసులు జారీ చేసింది. అప్పట్లోనే ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో దుమారం రేపింది. ఐదు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి ఆ జాబితాలో ఉన్న మోపిదేవి వెంకటరమణ మినహా మిగతా వారికి న్యాయ సహాయం అందించాలని నిర్ణయించింది.
ఓ ప్రైవేటు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీం కోర్టు వివరణ మాత్రమే కోరిందని... అంత మాత్రాన వారిని నిందితులు అనాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ వాదించింది. అటు మంత్రులు కూడా నోటీసులు అందుకున్నంత మాత్రాన కళంకితులమనే ముద్ర వేయవద్దని వాపోయారు. అయితే... ఇటు ప్రభుత్వానికీ, ఇటు మంత్రులకూ షాక్ ఇచ్చేలా సుప్రీం కోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలు వాస్తవమే అని దాదాపు ద్రువీకరించింది.
జగన్ అక్రమార్జనకు వీరంతా సహకరించారని ద్రువీకరించింది. వివాదాస్పద జీవోలకు సంబంధించి ఏం జరిగింది, వాటి ద్వారా ఎవరు లబ్ధి పొందారు, లబ్ధిపొందిన వారు జగన్ కంపెనీల్లో ఎలా పెట్టుబడులు పెట్టారు అనే అంశాలను అఫిడవిట్లో వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్లోనే దీనిని దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ జారీ చేసిన జీవోల పరిశీలన అప్పటికి ఇంకా పూర్తికాలేదని సిబిఐ తెలిపింది. మంత్రి గీతా రెడ్డిని కూడా తాము ప్రశ్నిస్తామని కూడా చెప్పింది.
ఇప్పటికే వాన్పిక్ కేసులో ఇప్పటికే మోపిదేవి అరెస్ట్ అయ్యారు. ధర్మానపై చార్జిషీటు దాఖలైంది. మిగిలిన నలుగురు నోటీసు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల పైనా సుప్రీంలో అభియోగాలు మోపినంతపనైంది. వీరితోపాటు ఐఏఎస్ అధికారులనూ తప్పు పట్టినట్లయింది. జీవో నెం. 1490, 1190, 1115లు ద్వారా పెన్నా సిమెంట్స్కు భూకేటాయింపులు, జీవో నెం.19, 21-30, 32, 35, 46, 42 ద్వారా వాన్పిక్ ప్రాజెక్టుకు కేటాయింపులు, జీవో నెం. 91, 25, 76 ద్వారా పెన్నా సిమెంట్స్కు, జీవో నెం. 107 ద్వారా సరస్వతీ పవర్కు, జీవో నెం. 321 ద్వారా ఈశ్వర్ పవర్కు సున్నపురాయి గనుల లీజులు, జీవో 146, 94 ద్వారా పది లక్షల గ్యాలన్ల నీరు పారిశ్రామిక అవసరాలకు కేటాయించడంపై సీబీఐ తన అఫిడవిట్లో వివరించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, రఘురాం సిమెంట్స్కు సంబంధించి జీవోలు విడుదల చేసిన అధికారులను ఇప్పటికే విచారించామని తెలిపింది. జగతి పబ్లికేషన్స్లో 1246 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు వైయస్ హయాంలో లభించిన ప్రతిఫలాల గురించి అఫిడవిట్లో వివరించింది. సెజ్లు, ప్రభుత్వ భూములు, నీటిపారుదల కాంట్రాక్టులు, మైనింగ్ లీజులను ఈ కంపెనీలకు కేటాయించారని వివరించింది. ప్రభుత్వ జివోల ద్వారా లబ్ధిపొందిన, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై దాడులు చేసి సోదాలు నిర్వహించామని తెలిపింది.












Click it and Unblock the Notifications