కొత్త రక్తం కావాల్సిందే: ప్రత్యామ్నాయం ఎన్నాళ్లు?
భారత క్రికెట్ జట్టు ఇటీవల వరుసగా విఫలమవుతోంది. ఇంగ్లాండులో ఓటమికి ఇక్కడ వైట్ వాష్చేసి ప్రతీకారం తీర్చుకుంటామని ఇంగ్లాండు పర్యటనకు వచ్చిన ప్రారంభంలో మన ఆటగాళ్లు గంభీర వచనాలు పలికారు. వైట్ వాష్ ఏమో కానీ అసలు సిరీస్ ఓడిపోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే పూర్తిగా నిరాశపడ్డ భారత అభిమానులకు నాగపూర్ టెస్టులో మన జట్టు గెలిచి సిరీస్ను సమం చేస్తే తప్ప కొద్దో గొప్పో ఊరట కలగదు.
రెండు, మూడో టెస్టులో భారత బౌలర్లు, బ్యుట్సుమెన్ ఫెయిల్ అయిన చోట ఇంగ్లాండు క్రికెటర్లు అద్భుత ప్రతిభ కనబర్చారు. అలిస్టర్ కుక్ వరుస సెంచరీలతో దూకుడు ప్రదర్శించారు.
సిరీస్లో కొద్దో గొప్పో మంచి ప్రదర్శన ఎవరైనా ఇచ్చారా అంటే కేవలం ఛటేశ్వర్ పుజారా మాత్రమే. మొదట బాగా ఆడి రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేశారని అభిమానులు భావిస్తున్న తరుణంలో అతను కూడా మెరుగైన ఆట తీరును కనబర్చలేకపోయాడు. అయితే ఒక్క ఆటగాడు ప్రతిసారి బాగా ఆడాలని లేదు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో రెండో ఇన్నింగ్సులో టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్సుమెన్ ఫెయిల్ అయితే ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ నాటౌట్గా నిలిచి 91 పరుగులు చేయడం గమనార్హం. దీంతో మన వారి బ్యాటింగ్ తీరు అర్థమవుతోంది.
గాయాలపాలవుతున్న జహీర్ ఖాన్కు ప్రత్యామ్నాయం చూడాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు కూడా ప్రత్యామ్నాయం చూడాల్సిందే అంటున్నారు. అయితే జట్టు విఫలమవుతున్న ఇలాంటి సమయంలో సచిన్ వంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని కొందరు చెబుతుండగా... వరుసగా విఫలమవుతున్న సచిన్ స్థానంలో మరొకరిని తీసుకోవాలని మరికొందరు వాదిస్తున్నారు. ఈడెన్ గార్డెన్సులోని రెండో ఇన్నింగ్సులో సచిన్ రాణించాడు. ప్రస్తుతం సచిన్ పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటే అతను సెంచరీ చేసినా న్యూసే. చేయకున్నా న్యూసే అయ్యే పరిస్థితి ఉంది.
నాగపూర్ టెస్టు డ్రా అయినా, ఇంగ్లాండ్ ఇదే దూకుడుగా వ్యవహరించినా భారత్ పరువు మరింత గంగపాలు కావడం ఖాయం. టెస్టుల ప్రారంభానికి ముందు మనవారు పలికిన గంభీర వచనాలు అన్నీ మాటలకే పరిమితమయ్యాయి. ఏ ఒక్కరూ పూర్తిగా ఆకట్టుకోలేక పోయారు. మన పిచ్లపై ఇంగ్లాండు బ్యాట్సుమెన్ పరుగుల వరద కురిపిస్తుంటే మన బ్యాట్సుమెన్ మాత్రం విఫలమవుతున్నారు.
ఇంగ్లాండు బౌలర్లు చెలరేగి మన బ్యాట్సుమెన్కు ముచ్చెమటలు పట్టిస్తుంటే మన బౌలర్లు వారిని పెవిలియన్కు పంపించేందుకు అపసోపాలు పడుతున్నారు. బౌలర్లు, బ్యాట్సుమెన్ ఇద్దరూ ఫెయిల్ అవుతున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో ఇంగ్లాండు బౌలర్లు, బ్యాట్సుమెన్ మంచి ప్రదర్శన కనబరుస్తుండటం గమనార్హం. సొంత పిచ్ల పైన చాపచుట్టేస్తున్న భారత జట్టుపై విమర్శల హోరు వెల్లువెత్తుతోంది.
దీంతో నాగపూర్లో జరిగే నాలుగో టెస్టుకు జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లాండు సిరీస్ ఎలాగూ అయిపోతోంది. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులు నాగపూర్లో జరిగే నాలుగో టెస్టు కంటే భారత జట్టు భవిష్యత్తు గురించే ఆందోళన చెందుతున్నారు. జట్టులో మార్పులు చేర్పులు గురించి ఆలోచనలు చేస్తున్నారు. జట్టులో ఎవరెవరికి ఉద్వాసన పలకాలి? ఎవరి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలి? అనే అంశాలపై సామాన్య అభిమాని నుండి బోర్డు వరకు ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జహీర్, సచిన్ వంటి ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాన్ని ఎప్పుడు తీసుకు వస్తారనే ప్రశ్న తొలుస్తుంది.