ఐటీ కారిడార్కు పొంచి ఉన్న నీటిముప్పు
ప్లాస్టిక్ వినియోగం కేవలం పర్యావరణానికి మాత్రమే ముప్పుగా పరిణమించలేదు. జల దిగ్బంధంతో జన జీవనానికి ఇబ్బందికరంగా మారిందని హైదరాబాద్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు చెప్తున్నాయి.
హైదరాబాద్: మనం షాపింగ్కెళ్తే తేలిగ్గా ఉన్నదని ప్లాస్టిక్ క్యారీబాగ్ తీసుకెళతాం. కానీ ఇదే ప్లాస్టిక్ మన ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుందంటే నమ్ముతారా? లేదా? అవును ముప్పు తథ్యం. ఎలాగంటారా? రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగర పరిధిలో కురిసిన భారీ వర్షం అన్ని ప్రాంతాలను జల దిగ్బంధం చేసేంది.
అందుకు ఐటీ కారిడార్ మినహాయింపేం కాదు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు! నీరు ఎందుకలా నిలిచిందని తలలు బద్దలు కొట్టుకొట్టుకున్న అధికారులు చివరికి విషయం తెలుసుకొని అవాక్కయ్యారు!
చిన్న గుంత పడితే కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు పూర్తిగా దిగువకు వెళ్లిపోతుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా పెద్ద నీటి ప్రవాహాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు నిలువరిస్తున్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఇదే జరుగుతోంది.
రోడ్లపై నీటిని నిలువరించిన ప్లాస్టిక్ కవర్లు
ఇటీవలి వర్షాలకు ఐటీ కారిడార్లో ఎక్కడికక్కడ రోడ్డు మీదే నీరు నిలిచి పోయింది. సోమవారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఆ రోజు చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల మేర వర్షం పడితే.. ఐటీ కారిడార్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. చాలా ప్రాంతాల్లో మరుసటి రోజు రహదారులన్నీ క్లియరయ్యాయి. కానీ, ఐటీ కారిడార్లో మాత్రం మంగళవారం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి పోయింది. కిలోమీటర్ ప్రయాణానికి కూడా నాలుగైదు గంటలు పట్టింది. ఎందుకీ దుస్థితి? ఈ ప్రశ్నలకూ ఒక్కటే జవాబు. ప్లాస్టిక్ కవర్లు!
నిర్ఘాంతపోయిన అధికార గణం
రోడ్లపై నీటి ప్రవాహాలకు చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలే కాదు. యూజ్ అండ్ త్రోగా ప్రజలు వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు ప్రతిబంధకంగా పరిణమిస్తున్నాయి. గచ్చిబౌలిలో ఇదే జరిగింది. బయోడైవర్సిటీ జంక్షన్ సమీపంలోని పైపుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకు పోయాయి. దీంతో ప్రవాహ వ్యవస్థ మూసుకున్న సంగతి తెలిసి అధికారులు నిర్ఘాంత పోయారు.
పైపుల్లో ప్లాస్టిక్ పేపర్లు ఇరుక్కోవడంతో దిగువకు వెళ్లే పరిస్థితి లేక వర్షపు నీరు రోడ్డుపైకి చేరింది. ఈ ప్రభావం లక్షలమంది ప్రజలపై ప్రభావం పడింది. గంటలకొద్దీ నెలకొన్న ట్రాఫిక్ జామ్ వాహనదారులకు నరకం చూపించింది. మంగళవారం దాదాపు సగం ఐటీ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు 50 శాతం తగ్గిందని చెబుతున్నారు. అరగంట, గంటలో వెళ్లే గమ్యాన్ని ఐదారు గంటలైనా చేరుకోలేక చాలా మంది ఉసూరుమని ఇళ్లకు వెనుదిరిగారు.
సిబ్బంది సరిగ్గా వ్యవహరిస్తే సమస్య పరిష్కారం ఇలా
హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మాదాపూర్ పరిసరాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని రోజుల ముందు ఇదే ఏరియాలో 7.8 సెం.మీ వర్షం కురిసింది. ఇంత ఇబ్బంది పడిన దాఖలాల్లేవు. మోస్తరుగా కురిసిన వర్షానికే ఇప్పుడు ఐటీ కారిడార్ స్తంభించింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు సాఫీగా వెళ్లే అవకాశం లేక ఈ దుస్థితి తలెత్తింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్, రహేజా ఐటీ తదితర ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తోంది. సాధారణంగా వర్షపు నీరు పాత ముంబై జాతీయ రహదారిపై ఉన్న కల్వర్ట్ కింద ఉన్న పైపుల ద్వారా దిగువకు వెళ్తున్నది. రహదారులు, భవనాల శాఖ అధికారులు గతంలో రెండు 1000 ఎంఎం డయా, ఒకటి 900 ఎంఎం డయా సామర్ధ్యంతో కూడిన పైపులైన్లు వేశారు. ఇందులో మూడు పైపులైన్లు ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూడుకు పోయాయి. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తే వరద నీరు స్తంభించేది కాదు.
గాలికి పడేస్తున్న ప్లాస్టిక్ కవర్లతోనే కష్టాలు
నగరంలో రోడ్లపై వరద నీరు నిలిచేందుకు వ్యర్ధాల మేటే కారణం. ప్రతి ఏటా డ్రైనేజీ, స్ర్టామ్ వాటర్ డ్రైన్లలో పూడిక తొలగిస్తున్నా, వర్షం పడినప్పుడు ప్లాస్టిక్ కవర్లు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. వస్తువులను కొనుగోలు చేసి కవర్లలో తెస్తున్న పజలు.. కవర్లను నాలాలు, రోడ్లపై పడేస్తున్నారు. దీంతో డ్రైనేజీలు, నాలాల్లో వ్యర్థాలు మేట వేస్తున్నాయి. మట్టి, ఇతర వ్యర్థాలు ప్రవాహంతోపాటు మెల్లగా ముందుకు కదులుతాయి. ప్లాస్టిక్ కవర్లు అందుకు భిన్నం. దీంతో వరద నీరు నిలిచిపోతోంది.
ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలా
నాలాల్లో కవర్లు వేయొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి ప్రజలను కోరారు. ‘ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించాం. నాలాలు, రోడ్లపై వేయకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుత మౌలిక వసతులు, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వరద నీటిని త్వరగా వెళ్లేలా చేయడం తప్ప.. ఇప్పటికప్పుడు మార్పు అసాధ్యం. డ్రైన్లలో కవర్లు వేయకుండా ఉంటే గచ్చిబౌలిలో ఇబ్బంది ఎదురయ్యేది కాదు'' అని పేర్కొన్నారు.