త్వరలో రూ.2000నోటు : కసరత్తులు పూర్తి చేసిన ఆర్బీఐ
న్యూఢిల్లీ : ఓవైపు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి అవినీతిని అరికట్టాలనే వాదన వినిపిస్తుంటే.. మరోవైపు రూ.2000 నోటును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమైంది ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కరెన్సీ నోట్లను తయారు చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగా.. రూ.2000నోటుకు సంబంధించిన కసరత్తులను ఇప్పటికే పూర్తి చేసింది ఆర్బీఐ.
మైసూర్ లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లో ఈ కొత్త నోట్లను ముద్రణను పూర్తి చేసిన ఆర్బీఐ.. ప్రస్తుతం ఆ నోట్లను కరెన్సీ చెస్ట్ లకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా దేశంలో రూ.1000 నోటు మాత్రమే అత్యధిక విలువ గల నోటుగా చలామణిలో ఉంది. గతంలో 1978ల్లో రూ.10,000, రూ.5000 రూ.1000నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది.
ఆ తర్వాత 2000వ సంవత్సరం నాటి నుంచి రూ.1000 నోట్ల చలామణి పున: ప్రారంభమైంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2016 నాటికి దేశంలో రూ.16,41,500 కోట్ల కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. గతేడాదితో పోల్చి చూసుకుంటే.. ఇది 15 శాతం వృద్ధికి సమానం. కాగా, ఇందులో రూ.500, రూ.1000నోట్లే 86.4శాతం వరకు ఉండడం గమనార్హం.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. కరెన్సీ నోట్లకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ ద్రుష్ట్యా.. కొత్త నోట్ల ముద్రణ చేపడుతోంది ఆర్బీఐ. అయితే కొత్త నోట్ల ముద్రణ ఆర్బీఐకి ఒకింత భారంగానే పరిణమించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.1000నోటు ముద్రణకు 3 రూపాయలు ఖర్చు చేస్తోంది ఆర్బీఐ. ఇదే అతి తక్కువ ముద్రణా వ్యయం. ఇక ప్రస్తుతం ముద్రిస్తోన్న రూ.2000నోటుపై ఆర్బీఐ ఎంత ఖర్చు చేస్తుందనేది తెలియదు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోన్న సూచనల మేరకే ఆర్బీఐ కొత్త డినామినేషన్ నోట్ల ముద్రణకు పూనుకున్నట్లు సమాచారం.