ఎవరి రాముడు వారికే!: తెలుగు వారింట 2 కల్యాణాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శ్రీ సీతారాముల కళ్యాణం రెండు ప్రాంతాల్లో జరగనుంది. సమైక్యాంధ్ర ప్రదేశ్లో గోదావరి తీరాన గల భద్రాచలంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన (జూన్ 2) అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెరాస, టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీతారాముల కళ్యాణం కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో అధికారికంగా నిర్వహించనుంది. విభజనలో భాగంగా భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భద్రాచలంను ఏపీకి ఇవ్వాలని మొదట సీమాంధ్ర నేతలు పట్టుబడ్డారు. 1956కు ముందు భద్రాచలం ఏపీలో ఉండేదని, ఇప్పుడు కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భౌగోళిక, ప్రజాభిప్రాయం... ఇలా పలు కారణాలతో భద్రాచలం తెలంగాణలో ఉండిపోయింది. అయితే, భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన సీతారాముల కళ్యాణ్ కాబట్టి అధికార తెరాస ప్రభుత్వం.. ఈ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సీతారాముల కళ్యాణం కోసం చరిత్ర కలిగిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఎంచుకుంది! శుక్రవారం నాడు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు ఈ విషయమై చెప్పారు. కడప జిల్లాలోని అత్యంత పురాతన ఆలయమైన ఒంటిమిట్ట ఏకశిలానగరం రామాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు.
రాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. మార్చి 28వ తేదీన శ్రీరామ నవమి నిర్వహణకు దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలన్నీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తాయని చెప్పారు. భద్రాచలం ఆలయానికి వందల ఏళ్ల ముందే ఒంటిమిట్ట రాములవారు పూజలు అందుకున్నారని తెలిపారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించిన ఆధారాలున్నాయన్నారు.
ఇదీ భద్రాచల రాముడు...
భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉంది. హైదరాబాదుకు 312 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది పక్కన ఉంది. దీనిని భక్త శ్రీరామదాసు నిర్మించారు. 1956కు ముందు ఇది తూర్పు గోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. సమైక్యాంధ్ర ప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో.. ఇప్పుడు తెలంగాణలో ఉంది.
భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంటుంది. ఇక్కడి నుండే సీతామాతను రావణాసురుడు అపహించుకుపోయాడు. జటాయు పాక భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భద్రాచలానికి 55 కిలోమీటర్ల దూరంలో శబరి నది గోదావరిలో కలుస్తుంది. దీనిని శ్రీరామగిరి అంటారు. భద్రాచలం ఆలయాన్ని పదిహేడవ సెంచరీలో కట్టారు.
ఒంటిమిట్ట రామచంద్రుడు...
ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కడప జిల్లాలో కొలువై ఉన్నాడు. కడప పట్టణానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో, రాజంపేటకు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఒంటుడు, మిట్టుడు అనే వారు ఈ ఆలయాన్ని ఒకేరోజులో నిర్మించారంటారు. ఆలయ నిర్మాణం అనంతరం వారు తమ చనువు చాలించి, శిలలా మారిపోయారని చరిత్ర.
ఆలయానికి వెళ్లే దారిలో ఈ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఒంటిమిట్ట రాముల వారికి ఓ అరుదైన చరిత్ర ఉంది. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా.. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం రాత్రి పూట జరుగుతుంది. 1652వ సంవత్సరంలో ఫ్రెంచ్ యాత్రికుడు ఈ ఆలయాన్ని చూసి దేశంలోనే అతి సుందర ఆలయమని ప్రశంసించారు.
ఇక్కడి ప్రజల భక్తుల తన్మయత్వం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఆలయం 32 పిల్లర్లతో ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయని అంటున్నారు.