పాక్పై మోడీ మరో ఎత్తు: అబుదబీ యువరాజుకు ఆహ్వానం వెనుక!
న్యూఢిల్లీ: యూరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎన్నో వాటిల్లో దాయాది దేశాన్ని ఏకాకిని చేసింది. తాజాగా, భారత్.. పాక్కు మరో ఝలక్ ఇచ్చింది.

2017 గణతంత్ర వేడుకలకు అబుదబీ యువరాజు
ఈసారి గణతంత్ర వేడుకలకు (2017) ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జయద్ను ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. సాధారణంగా గణతంత్ర వేడుకలకు దేశాధినేతలను ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.

ఆహ్వానం
అయితే ఈసారి దానిని పక్కనపెట్టి అబుదాబి యువరాజు బిన్ జాయద్ను ఆహ్వానించారు. తద్వారా అరబ్ దేశాల వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన కుటుంబానికి ప్రధాని మోడీ అత్యంత గౌరవం ఇచ్చినట్లయిందని చెబుతున్నారు.

రాజకుటుంబం
దుబాయ్, అబుదాబి సహా ఐదు ఎమిరేట్ల సమాఖ్యకు అబుదాబి రాజ కుటుంబం అధ్యక్షుడిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అబుదాబి రాజుగా ఉన్న షేక్ ఖలీఫా అనారోగ్యం పాలవడంతో కీలకమైన అంతర్జాతీయ వ్యవహారాలన్నీ ఆయన సోదరుడు, యువరాజు షేక్ మహమ్మద్ చూస్తున్నారు.

నాడు ప్రోటోకాల్ పక్కన పెట్టిన మోడీ
అమెరికా అధ్యక్షుడిని సైతం పెద్దగా పట్టించుకోరని పేరున్న జాయద్కు ప్రధాని మోడీతో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో జాయద్ భారత్లో పర్యటించినప్పుడు ప్రొటోకాల్ను పక్కన పెట్టి మరీ ప్రధాని మోడీ ఆయనకు నేరుగా స్వాగతం పలికారు. అబుదాబి రాజును ఆహ్వానించడం ద్వారా పాక్ను దౌత్యపరంగా ఒంటరిని చేసే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications