కాంగ్రెస్కు పరీక్ష
గడచిన నాలుగు వారాలుగా జరుగుతున్న సంఘటనలు తెలంగాణ ఉద్యమానికి ఊపరినిచ్చాయి. ఇక యుపిఎ ప్రభుత్వం వున్నన్ని రోజులు తెలంగాణ అనేది తీరని కలే అని సగటు తెలంగాణవారి ఆశలు అడుగంటుతున్న దశలో ఒక దాని తర్వాత ఒకటి జరుగుతున్న ఘటనలు ఎక్కడో ఆ ఆశని సజీవంగా ఉంచగలిగాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సిన సంఘటన ప్రొఫెసర్ జయశంకర్ రాజీనామా. కెసిఆర్ చెబుతున్నట్లు అనారోగ్యం వల్లనైతేనేమి, మీడియా చెబుతున్నట్లు అసంతృప్తి వల్లనైతేనేమి ఒక నిజమైన తెలంగాణవాది ఢిల్లీని, పదవిని వదలి క్షేత్రరంగానికి రావడం శుభసూచకం. రాష్ట్రానికి తిరిగి వచ్చిన జయశంకర్కు లభించిన సాదర ఆహ్వానాన్ని పరికిస్తే తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమం మీద ఇంకా ఎంత ప్రేమ వుందో అర్థం అవుతుంది. కల్మషం లేకుండా పోరాడేవారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని దీంతో తెలిసిపోతుంది. కెసిఆర్, నరేంద్ర ద్వయం దీని నుండి అయినా ఏమన్నా నేర్చుకుంటారేమో చూడాలి.
ఇక చెప్పుకోవాల్సిన మరొక సంఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసువారి అత్యుత్సాహం, హోలీ జరుపుకోవడానికి తెలంగాణ విద్యార్థులు, ప్రొఫెసర్లు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఒక్క తాటిపై నిలిచి ఖండించడం నిజంగా అభినందించాల్సిన అంశం. ఆ సంఘటనపై నిరసన చూసినవారికి తెలంగాణ ఉద్యమం ప్రశాంతంగా వుందే కాని అంతరించిపోలేదని తెలియజెప్పింది. అలాగే జి.వో. 72 విషయంలో ప్రతిపక్షాలన్ని ఒక్కటై దాన్ని సస్పెండ్ చేయించిన తీరు కూడా మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే హైదరాబాద్లో బిజెపి అధినేత రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక తెలంగాణకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం మరొక ఎత్తు. రాజ్నాథ్ ప్రకటన ఎంత స్పష్టంగా వుందంటే కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేకులకు కూడా గుండెల్లో గుబులు రేపింది. ఎక్కడ డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా తన అభిప్రయాన్ని తెలియచేశారాయన. ఆయన ప్రకటన వెనక తెలంగాణ బిజెపి నాయకులు ఇంద్రసేనారెడ్డి, విద్యాసాగరరావు, దత్తాత్రేయలాంటి వారి ప్రయత్నమే కాకుండా, ఆర్యస్యస్ ఛీఫ్ సుదర్శన్ సలహా, కెసిఆర్/ నరేంద్రల దౌత్యం కూడా వున్నాయి. లేఖ ఇస్తేనే కాని మేము లెక్క చేయమనే డొంకతిరుగుడు కారణాలను కాంగ్రెస్ ఎక్కువ రోజులు చెప్పే పరిస్థితి లేదు. వరంగల్లో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన మేధావుల, ఉద్యోగుల సమ్మేళనమే మారుతున్న సమీకరణాలకు సూచిక. బిజెపి గ్రామ గ్రామాన తిరుగుతూ ఉద్యమాన్ని నిర్మిస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టకమానవు. ప్రజలకి కావాల్సింది తెలంగాణనే కాని పార్టీ సిద్ధాంతాలు కాదని గడిచిన పంచాయతీ ఎన్నికల్లో తెరాస అఖండ విజయమే చెబుతోంది.
అతి త్వరలోనే తెలంగాణకి చెందిన తెరాస/ కాంగ్రెస్ క్యాడర్ అంతా బిజెపి వెనక నిలబడే పరిస్థితి వస్తుందనుకున్న తరుణంలో కెసిఆర్, నరేంద్రలు మంత్రిపదవులకు రాజీనామాలు చేశారు. తమ క్యాడర్ను నిలుపుకోవడానికే కాకుండా తెలంగాణ కోసం ఉద్యమించడానికి తెరాస అగ్రనేత నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కాంగ్రెస్కు పరీక్షనే. తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్కు గడ్డుకాలం తప్పదు.