ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా అనూహ్య ఎంపిక, నాడు జగన్ ఫిర్యాదుతో..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రధాన పోస్టు నియామకం పైన తుది నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ తో పాటుగా విజిలెన్స్ కమిషన్ పోస్టుల పైనా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసి.. పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారులకు ఈ నియామకం ఖరారు చేసింది. గతంలో వైపీపీ ఫిర్యాదు కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన మాజీ సీఎస్ కు ఎన్నికల కమిషనర్ గా అవకాశం కల్పించనుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా(ఎస్ఈసీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్రపునేఠా నియమితులు కానున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే గవర్నర్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. పునేఠా రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఫిర్యాదు ల నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనను ఈ పోస్టు నుంచి తప్పించింది. తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. గత ఏడాది పునేఠాను విజిలెన్స్ కమిషనర్గా నియమించారు. ఇప్పుడు అదేపదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సమర్థుడైన పునేఠాను ఎంపిక చేసినట్లు తెలిసింది. మరో రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎస్ నీరభ్ కుమార్ను పునేఠా స్థానంలో విజిలెన్స్ కమిషనర్గా నియమించాలని నిర్ణయించారు.

ప్రభుత్వంల ో కీలక బాధ్యతలు నిర్వహించిన పునీఠా
ఈ ఇద్దరు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసారు. 2019 ఎన్నిక ల సమయంలో పునీతా స్థానంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యం ను నియమించింది. జగన్ సీఎం అయిన తరువాత కొంత కాలానికి నాడు చోటు చేసుకున్న పరిణామాలతో డిమోషన్ ఇచ్చి ఎల్వీని సీఎస్ పదవి నుంచి తప్పించారు. ఇక.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగిసింది. ఆ స్థానంలో పునేఠాకు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అనిల్ చంద్ర పునేఠా సొంత రాష్ట్ర ఉత్తరాఖండ్. ఎకనమిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన.. రూరల్ డెవలప్మెంట్లో పీజీ చదివారు. ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు. 1984 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన పునేఠా.. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఐఏఎస్ అధికారిగా తన కెరీర్ను ప్రారంభించారు. 2019 ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్సీ డీజీ బదిలీ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల అమలు జాప్యం చేశారనే కారణంతో.. చీఫ్ సెక్రటరీ పదవి నుంచి ఆయన్ను తప్పించింది. ఆ తర్వాత పునేఠా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పని చేశారు. ఈ నియమకాల పైన గవర్నర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.













Click it and Unblock the Notifications