రాజకీయాల్లో కిరీటి వైయస్

ముఖ్యమంత్రిగా 2004లో పదవి చేపట్టినప్పటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహార శైలే పూర్తిగా మారిపోయింది. నిత్య అసమ్మతివాదిగా పేరు పొందిన వైయస్ అధికార రాజకీయాలు నడపలేడనే అపోహ ఉండేది. అది అపోహ మాత్రమేనని ఆయన నిరూపించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును నైతికంగా దెబ్బ తీయడంలో ఆయన ఎనలేని తెగువను ప్రదర్శించాడు.
తెరాస అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంత్రివర్గంలో చేరిన తర్వాత తెరాస ఉనికిని దెబ్బ తీసేందుకు నిరంతరం పనిచేశారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలహీనపరిచే పనికి పూనుకున్నారు. తెరాస నాయకుల చేతనే ఆయన ఆ పార్టీని బలహీన పరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. 2009 ఎన్నికల్లో తెరాసతో పొత్తును కరాఖండిగా వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూనే సమైక్యవాదాన్ని బలంగా నిలబెట్టిన నాయకుడు ఆయన. దాదాపుగా తెరాస ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన నిరంతరం ఎదురుదాడినే అస్త్రంగా ఎంచుకున్నారు. ఎదురుదాడితో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ప్రతిపక్షాలను ఇంతగా ఆత్మరక్షణలో పడేసిన కాంగ్రెసు నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు.తనను నమ్మినవారికి అభయహస్తం అందించడం వల్లనే ఇంతగా ఆయన నిలదొక్కుకోగలిగారు.












Click it and Unblock the Notifications