బాబు తెలంగాణ టూర్?

సీమాంధ్ర నాయకులెవరూ తెలంగాణలో పర్యటించలేని స్థితి ఉంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆ మధ్య ఆదిలాబాదు పర్యటన చేసి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, పకడ్బందీగా సభకు ప్రజలను అనుతించినప్పటికీ తెలంగాణ నినాదాలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. అయితే తెలంగాణవాదం బలహీనంగా ఉందని భావిస్తున్న ఖమ్మం జిల్లాలో కూడా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. ముందస్తుగా తెలంగాణవాదులను అరెస్టు చేయడం, పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడం వంటి కొన్ని చర్యల వల్ల జగన్ యాత్ర సాగింది. మధ్య మధ్యలో విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఖమ్మం జిల్లాకు వచ్చి పోతున్నారు. అయినప్పటికీ ఆయనకు తెలంగాణవాదుల నుంచి అడ్డంకులు తప్పడం లేదు. తాజాగా ఆదివారం కూడా ఆయన తెలంగాణవాదుల నుంచి ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తాను తెలంగాణలో పర్యటిస్తానని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆయన నిజంగానే తెలంగాణ పర్యటన పెట్టుకుంటున్నారా, ప్రజల నాడిని తెలుసుకోవడానికి అలా ప్రకటనలు చేస్తున్నారా అర్థం కావడం లేదు. అయితే, చిరంజీవి తెలంగాణ పర్యటనకు ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయడానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ, చిరంజీవి తెలంగాణలో పర్యటిస్తే, చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల నిజంగానే చిరంజీవి పర్యటన జరిగే స్థితి ఉంటే అంతకన్నా ముందుగా తాను పర్యటించాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications