నామ్ కే వాస్తే కాంగ్రెసు
తెలంగాణ జెఎసి నుంచి బయటకు వస్తే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి రావడమే కాకుండా తెలంగాణ సాధన ప్రయోజనాలు తమకు దక్కకుండా పోతాయనేది కాంగ్రెసు తెలంగాణ నాయకుల అభిప్రాయం. అంతేకాకుండా తాము జెఎసిలో ఉంటూ దాన్ని కట్టడి చేయడం ద్వారా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి వీలవుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెసు వల్లనే సాధ్యమవుతుందనేది గట్టిగా చెప్పుకుంటూ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ దాని క్రెడిట్ ను కూడా దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తాము జెఎసిలో లేకపోతే తెరాస, తెలుగుదేశం పార్టీలు, ప్రజా సంఘాలు దూకుడుగా వ్యవహరిస్తాయని, దాని వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి తిరిగి ఎన్నికలను ఆహ్వానించే దిశగా మాత్రమే అటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, ఇటు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుంటున్నట్లు కాంగ్రెసు నాయకులు అనుమానిస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పాచికలు పారకుండా చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. జెఎసి నుంచి బయటకు రావాలని తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేసిన ఆదేశాలను కూడా వారు ఒక రకంగా ధిక్కరించినట్లైంది. తద్వారా తెలంగాణ కోసం తాము ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా తెలియజేసిట్లయింది.
ఇదే సమయంలో మిగతా కాంగ్రెసు నాయకులు ఎప్పటికప్పుడు తోక జాడించడానికి వీలుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. వారిని గాడిలో పెట్టడానికి కూడా వీరు ముగ్గురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.