కోదండరామ్ వర్సెస్ గద్దర్
కోదండరామ్ పై గద్గర్ చాలా కాలంగా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన తెలంగాణపై తన సొంత ఉద్యమానికి మరోసారి ఊపిరి పోస్తున్నారు. కోదండరామ్ నేతృత్వంలో భౌగోళిక తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరుగుతోంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులను, ప్రజా సంఘాలను కూడగట్టి కోదండ రామ్ నేతృత్వంలోని జెఎసి చేస్తున్న పోరాటం జరుగుతున్నది అందుకే. కానీ గద్దర్ ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటున్న రాజకీయాలతో ఉన్నారు. విప్లవ రాజకీయాలు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకుంటున్నాయి. ఈ విషయాన్ని గద్దర్ స్వయంగా ఒకానొక సందర్భంలో చెప్పారు కూడా. మావోయిస్టు రాజకీయాలతో తాను ఉన్నట్లు ఆయన పలు మార్లు చెప్పారు కూడా. అందువల్ల ఈ రాజకీయాలకు భౌగోళిక తెలంగాణ సాధన అనేది అంత ప్రాధాన్యం కాదు. అయితే దాన్ని కూడా ఆ రాజకీయాలు ఆహ్వానిస్తున్నాయి. భౌగోళిక తెలంగాణ ఏర్పాటును తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆ రాజకీయాలు గుర్తిస్తున్నాయి.
గద్దర్ కు తెలంగాణ రాష్ట్ర సాధన అంత ముఖ్యం కాకపోవడమనేది ఆయన కార్యక్రమాలను బట్టి అర్థమవుతూనే ఉన్నది. తెలంగాణ ఉద్యమం వెనక తట్టు తట్టినట్లు అనిపించిన ప్రతిసారీ ఆయన నిప్పు రాజేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన మరోసారి క్రియాశీలకంగా ముందుకు వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.