చిరుకు ఏ మాత్రం లాభం?
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ చిరంజీవి కాలికి బలపం కట్టుకుని ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు తదితర జిల్లాల్లో కూడా ఆయన పర్యటించారు. దీంతో ఆ కోస్తాంధ్రలో ఆయన కొంత మేరకు క్యాడర్ లో, అభిమానుల్లో ఉత్సాహం నింపగలిగారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కలిసి వస్తుందని దిగువ శ్రేణి నాయకులు ఆశపడ్డారు. అయితే, కాంగ్రెసుతో పొత్తు కుదరడంతో పరిస్థితి తారుమారయ్యేట్లు కనిపిస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవారు ఇప్పటి వరకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెసుతో పొత్తు కుదరడంతో ఈ దిగువ శ్రేణి నాయకులు కొంత మేరకైనా జారిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెసుతో పొ్త్తు వల్ల తమకు పోటీ చేసే అవకాశం రాదేమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఇది చిరంజీవికి నష్టం కలిగించేదే.
అయితే, భవిష్యత్తులో కాంగ్రెసు పొత్తు చిరంజీవికి వ్యక్తిగతంగా కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ నుంచి తప్పుకుంటే అనూహ్యమైన అవకాశం చిరంజీవికి దక్కవచ్చు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఏమైనా, రాజకీయ పరిణామాలే చిరంజీవి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.