జగన్ ను కిరణ్ ఆపగలరా?

వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి వైయస్ జగన్ విశాఖపట్నం జిల్లా ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఆ స్థితిలో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డికి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే, వైయస్ జగన్ వర్గం పకడ్బందీగా కాంగ్రెసు మాజీలకు, స్థానిక నాయకులకు, ద్వితీయశ్రేణి నాయకులకు గాలం వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆదివారం కృష్ణా జిల్లా పరిణామాలు కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా కదిలించినట్లే ఉన్నాయి. శాసనసభా సమావేశాల సందర్భంగా ఆయన కృష్ణా జిల్లా శాసనసభ్యులతో సమావేశమయ్యారు. అప్పటికే, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను నష్టనివారణ చర్యలకు పురికొల్పినట్లు వార్తలు వచ్చాయి.
విశాఖపట్నం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆ జిల్లా మంత్రి బాలరాజు కూడా శాసనసభ్యులతో భేటీ అయ్యారు. శాసనసభ్యులు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తపడడంలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు. సాధ్యమైనంత మేర జిల్లా నుంచి కాంగ్రెసువారు ఓదార్పు యాత్రకు వెళ్లకుండా నిరోధించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. అయితే, వైయస్ జగన్ ను ఏ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి ఆపగలరనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications