కెసిఆర్ లైవ్ స్ట్రగుల్

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల నాయకత్వాలను ఆయన విశేషంగా ప్రోత్సహిస్తున్నారు. ఇతర వర్గాలను కూడగడుతున్నారు. మీడియాకు కూడా రాజ్ న్యూస్ ద్వారా తెలంగాణ కోణాన్ని అందించి, తెలంగాణ ఉద్యమకారులకు గొంతునిస్తుండడమే కాకుండా వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు సిద్ధపడ్డారు. పార్టీపరంగా ఇతర పార్టీ నాయకులే కాకుండా తాను కూడా అన్నివర్గాల తెలంగాణ ఉద్యమాలకు బలాన్ని సమకూరుస్తున్నారు. ఒక రకంగా మిలిటెన్సీని క్రమంగా క్రమంగా ఉద్యమంలోకి ప్రవేశపెడుతున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం అందులో ఓ భాగమేనని భావించాలి. అదే విధంగా సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థుల దాడిని కూడా అందులో భాగంగానే భావించాల్సి ఉంటుంది.
సీమాంధ్ర రాజకీయ నేతలు ఏదో విధంగా తెలంగాణను అడ్డుకోవడానికే ప్రయత్నిస్తారని, వారి ఒత్తిడికి కాంగ్రెసు అధిష్టానం లొంగే పరిస్థితే ఎక్కువగా ఉంటుందని ఆయన గమనించినట్లున్నారు. అందుకే, సీమాంధ్ర వర్గాలు తెలంగాణతో కలిసి ఉండడం విషయంలో ఒక రకమైన విసుగును, అయిష్టతను వ్యక్తం చేసే పరిస్థితిని కల్పించడం కూడా కెసిఆర్ వ్యూహంలో భాగమని అంటున్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాజకీయ పారిశ్రామికవేత్తలపై సీమాంధ్రకు చెందిన వివిధ వర్గాల నుంచి ఆ విసుగు నుంచి ఒత్తిడి పెరుగుతుందనేది ఆయన అంచనా వేస్తూ వుండవచ్చు. ఇలా విద్వేషాలతో, పరస్పర దాడులతో కలిసి ఉండడం కన్నా మన మానాన మనం ప్రశాంతంగా ఉందామనే అభిప్రాయం సీమాంధ్ర వర్గాల్లో కల్పించడం ఆయన పోరాట వ్యూహంలో ఒక భాగం కావచ్చు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబర్ 31వ తేదీ నాటికి తెలంగాణను పూర్తి స్థాయి ఉద్యమానికి సమాయత్తం చేయడం కూడా అందులో ప్రధానాంశం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉంటే చేయాల్సిన పోరాటం తీరుకు ఆయన ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications