మళ్లీ తెలుగుజాతి ఆత్మగౌరవం

తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదం మరోసారి ప్రధానం కావడానికి కూడా కాంగ్రెసు పార్టీయే కారణం కావడం విశేషం. కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది. ఈ స్థితిలో బాబ్లీ సందర్శనకు వెళ్లిన తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ నాయకుడి స్థాయికి ఎదిగిన చంద్రబాబు పట్ల మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు తెలుగు ప్రజలందరినీ కలచివేసింది. బాబ్లీ ప్రాజెక్టు మరో దేశంలో లేదు. మన దేశంలోనే ఉంది. దాన్ని చూడడానికి వెళ్లడం తప్పవుతుందా అనేది ప్రశ్న. సాధారణంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు. కానీ తెలుగుదేశం నాయకులను మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడమే కాకుండా వారిని అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టి, వారిపై పోలీసులతో లాఠీచార్జీ చేయించి అమానుషంగా వ్యవహరించింది.
మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిస్పందించిన తీరు ఏ మాత్రం బాగా లేదు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కేవలం ఖండించి ఊరుకోవాల్సిన స్థితిలో పడ్డారు. బాబ్లీ సందర్శనకు చంద్రబాబు బృందాన్ని అనుమతించాలని రోశయ్య చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పెడచెవిన పెట్టారు. కేంద్రంలోని పెద్దలు కూడా కదలలేదు. ప్రధాని మన్మోహన్ సింగ్ గానీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ చంద్రబాబుపై మహారాష్ట్ర తీరు పట్ల ఆక్షేపణ తెలపలేదు. అలా అవమానించకూడదనే సూచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి చేసినట్లు లేదు. ఈ స్థితిలో తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర చూపుతున్న చులకన భావం తెలుగు ప్రజలను కదిలించింది. దీంతో తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదానికి మరోసారి ప్రాణం వచ్చింది.
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో పాటు సినీ నటుడు మోహన్ బాబు, మంత్రి పితాని సత్యనాయరాయణ వంటి పలువురు రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా తెలుగుజాతి ఆత్మగౌవరం గురించి మాట్లాడుతున్నారు. తెలుగుజాతికి అవమానం జరిగిందని బాధపడుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదో మతలబు ఉందనే అనుమానాలను బలపరచడంలో, తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తేవడంలో చంద్రబాబు విజయం సాధించారనే చెప్పాలి.












Click it and Unblock the Notifications